ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారు అయింది. ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్షాలతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నట్టు తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రధానితో పాటు కేంద్ర పెద్దలతో చర్చించేందుకు జగన్ వెళ్లనున్నట్టు సమాచారం.
జగన్ ఢిల్లీ పర్యటన అంటే….ప్రతిపక్షాలకు ఎక్కువ ఆందోళన. ముఖ్యంగా టీడీపీ, ఎల్లో మీడియాకు ఎవరికీ చెప్పుకోలేని బాధ. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ కావాలని గత మూడేళ్లుగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. ముఖ్యమంత్రిపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అవాకులు చెవాకులు పేలడం, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులు జరగడం తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.
అప్పట్లో తమ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ చంద్రబాబు దీక్ష కూడా చేశారు. అనంతరం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతితో పాటు మరికొందరికి ఫిర్యాదు చేశారు. కేంద్రహోంమంత్రిని కలవాలని చివరి వరకూ ప్రయత్నించినా, అటు వైపు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఇదే జగన్ విషయానికి వచ్చే సరికి వెంటనే అపాయింట్మెంట్స్ ఇవ్వడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకుంది. అందుకే జగన్ ఢిల్లీ పర్యటన అంటే టీడీపీకి కోపం.
ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలు, పోలవరం ప్రాజెక్టు అంచనా మొత్తాన్ని పెంచడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రాష్ట్రానికి ఆర్థిక పరమైన భరోసా తదితర అంశాలపై కేంద్ర పెద్దలతో జగన్ చర్చించే అవకాశం ఉందంటున్నారు.