వైసీపీ సర్కార్కు ఏమైనా తలతిక్క పట్టిందా? కనీస స్పృహ లేకుండా నిర్ణయాలేంటో అసలు అర్థం కావడం లేదు. జర్నలిస్టులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్లకు ఏ మాత్రం సంబంధం లేకుండా కమిటీలను ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
జగన్ సర్కార్ అసంబద్ధ వైఖరిపై జర్నలిస్టు సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్న మహానుభా వులకు సన్మానం చేయడం తప్ప ఎవరైనా ఏం చేయగలరని వ్యంగ్యంగా అంటున్నారు.
తెలియక చేస్తే అర్థం చేసుకోవచ్చు. తెలిసి తెలిసి ఉద్దేశ పూర్వకంగా చేస్తుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇలాంటి చిత్రవిచిత్ర పోకడలతో చివరికి జగన్ సర్కార్కు నష్టం తెస్తున్నామని ఒక్క నిమిషమైనా ఆలోచించి ఉంటే…జర్నలిస్టులకు సంబంధం లేకుండా అక్రిడిటేషన్ కమిటీని ఏర్పాటు చేసే సాహసం సమాచారశాఖ ఉన్నతాధికారులు చేసి ఉండేవాళ్లా?
ఇప్పటికే అక్రిడిటేషన్లను వాయిదాలు వేసుకుంటూ నెలల తరబడి నెట్టుకొస్తున్నారు. ఆలస్యమైనా పద్ధతిగా చేస్తున్నారా? అంటే … అబ్బే, అది మన ఇంటావంటా లేదన్నట్టు సమాచారశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారనేందుకు ఇదే ఉదాహరణ అని జర్నలిస్టులు అంటున్నారు.
అక్రిడిటేషన్ల కాల పరిమితిని అనేక దఫాలుగా పొడిగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకూ మరోసారి పొడిగించారు. దీంతో జర్నలిస్టులంతా రెన్యువల్ చేయించుకున్నారు.
బహుశా కొత్త ఏడాది పురస్కరించుకుని కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర , జిల్లా అక్రిడిటేషన్ల కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో రాష్ట్రస్థాయిలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ చైర్మన్గా ఏర్పాటైన కమిటీలో వైద్యఆరోగ్యశాఖ ఏడీ, కార్మికశాఖ కమిషనర్, హౌసింగ్ పీడీ, దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ, సమాచారశాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు.
అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో జిల్లా వైద్యశాఖాధికారి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, హౌసింగ్ పీడీ, రైల్వే పీఆర్వో, ఆర్టీసీ ఆర్ఎం, డీపీఆర్వో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.
అయితే రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో జర్నలిస్టులు యూనియన్లు, జర్నలిస్టులకు ఏ మాత్రం స్థానం కల్పించకపోవడం గమనార్హం. జర్నలిస్టులతో సంబంధం లేకుండా కమిటీలు ఏర్పాటు కావడం బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొట్ట మొదటిసారై ఉంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ఏర్పాటైన కమిటీల్లో వాళ్లకు ప్రాతినిథ్యం లేకపోవడంపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. సమాచారశాఖ ఉన్నతాధికారులు జగన్ ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నాయని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కమిటీల్లో తమకు చోటు లేకపోవడం వల్ల నష్టపోతామని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.