ఒకవైపు లాక్ డౌన్ లో ఎవరూ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడగా, సినిమా వాళ్లు తమ స్టోరీ డిస్కషన్స్ ను ఆన్ లైన్ -వీడియో కాన్పరెన్స్ ల ద్వారా చేపడుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఏం చేయాలనే అంశానికి తగ్గట్టుగా వీరి ప్లానింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మేరకు తెలుగు సూపర్ హిట్ సినిమా 'అల వైకుంఠపురంలో' హిందీ రీమేక్ కు సంబంధించిన పనులు కూడా ఆన్ లైన్ ద్వారా సాగుతున్నాయని సమాచారం.
అందులో భాగంగా.. ఈ సినిమా స్క్రిప్ట్ ను ఆన్ లైన్లో విన్నాడట బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్. ఈ సినిమా హిందీ రీమేక్ లో నటించడానికి అతడు దాదాపుగా ఓకే చెప్పాడట. తెలుగులో ఈ సినిమాను రూపొందించిన నిర్మాతలే హిందీలో కూడా దీన్ని రూపొందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు కూడా చర్చలో పాల్గొన్నట్టుగా సమాచారం.
బాలీవుడ్ వెర్షన్ కు రోహిత్ ధావన్ దర్శకత్వం వహించబోతున్నాడు. రోహిత్ దర్శకత్వం పగ్గాలు తీసుకోవడంతో ఈ సినిమాలో అతడి సోదరుడు వరుణ్ ధావన్ హీరో అవుతాడని చాలా మంది భావించారు. అయితే అందుకు భిన్నంగా కార్తిక్ ఆర్యన్ ను హీరో పాత్రకు ఎంచుకున్నాడు ఆ దర్శకుడు. 2021లో ఈ సినిమా హిందీ వెర్షన్ పట్టాలెక్కుతుందని సమాచారం.