అన్నీ కుదిరితే ప్రేమ పెళ్లి అంత మధురమైంది మరొకటి లేదు. ఏ మాత్రం తేడా వచ్చినా కష్టాలే కష్టాలు. మానసిక, శారీరక ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమ అనేది మమతలనే కాదు …నిప్పును కూడా రాజేస్తుంది. ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంతో ఏకంగా పెళ్లి కొడుకు ఇంటికే నిప్పు పెట్టారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో చోటు చేసుకుంది.
గుంతకల్లు మండలంలోని వెంకటాంపల్లికి చెందిన బోయ మల్లికార్జున కూతురు సుమిత్ర గ్రామ వలంటీర్గా పని చేస్తోంది. అదే మండలంలోని నాగసముద్రానికి చెందిన నాగప్ప కుమారుడు హేమంత్ ఇంటర్ వరకూ చదివాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కాలం గడిచే కొద్ది వాళ్లిద్దరి మధ్య ప్రేమ బలపడింది. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
రెండురోజుల క్రితం ప్రేమికులిద్దరూ తమ ఇళ్ల నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే వధూవరులిద్దరినీ ఇంట్లో పెట్టుకుంటే సమస్యలొస్తాయని పసిగట్టిన పెళ్లికొడుకు తల్లిదండ్రులు … వాళ్లను బంధువుల ఇంటికి పంపారు. ఈ నేపథ్యంలో పెళ్లి కూతురు సుమిత్ర బంధువులు నాగసముద్రంలోని పెళ్లి కొడుకు హేమంత్ ఇంటిపైకి దాడికి వెళ్లారు.
హేమంత్ ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. చుట్టుపక్కల వాళ్లు మంటలు ఆర్పి వేయడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పెళ్లి కూతురు తరపు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.