తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కూర్చుని.. తనకు తోచిన లేఖలు రాస్తూ.. తనేదో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా ఫీలవుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు రాస్తున్న లేఖలు పచ్చ మీడియాలో పబ్లిష్ చేసుకోవడానికి తప్ప మరెందుకూ పనికి వచ్చేలా లేవు. పచ్చ మీడియా పాలిట చంద్రబాబు నాయుడు ఒక మేధావిగా, తోచిన, పోచికోలు సలహాలు ఇచ్చే పెద్ద మనిషిలా చలామణి అవుతూ ఉన్నారు.
ఆ సంగతలా ఉంటే.. తమ ఎమ్మెల్యే కనపడటం లేదంటూ కుప్పం నియోజకవర్గంలో మరో ఫిర్యాదు చోటు చేసుకుంది. కరోనా లాక్ డౌన్ ప్రారంభం కాక ముందు కూడా కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి ఫిర్యాదు ఒకటి నమోదయ్యింది. ఎన్నికలు అయిపోయాకా నెలలు గడుస్తున్నా తమ ఎమ్మెల్యే కనపడటం లేదని, పూర్తిగా మొహం చాటేశారని.. తమను పట్టించుకోవడం లేదని కుప్పం నియోజకవర్గంలో అప్పట్లోనే ఒక కంప్లైంట్ నమోదు అయ్యింది.
చంద్రబాబు నాయుడుకు గత ఎన్నికల్లోనే కుప్పం ప్రజలు చాలా వరకూ మెజారిటీని తగ్గించేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన పోటీ చేసిన ఎన్నికల్లోనే ఆయన మెజారిటీ ఆవిరి అయ్యింది. కుప్పంలో వచ్చే మెజారిటీతో కాపాడుకుంటూ వస్తున్న చిత్తూరు ఎంపీ కూడా టీడీపీకి అడ్రస్ లేకుండా పోయింది. ఇక చంద్రబాబు నాయుడు అమరావతి ఏరియాలోని 33 గ్రామాలకూ మాత్రమే ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ ఉండటం, తన ప్రేమాప్యాయతలన్నీ ఆ గ్రామాల మీదే చూపుతూ ఉండటం… ఈ పరిణామాల్లో కుప్పం ప్రజలు చంద్రబాబు మీద కత్తులు నూరుతున్నట్టుగా ఉన్నారు. తమను పట్టించుకోవడం లేదని తమ ఎమ్మెల్యే అయిన ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు.
ఇక కరోనా కష్టాల వేళ చాలా మంది ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాలకు అందుబాటులో ఉంటున్నారు. కొంతమంది సొంత ఖర్చులు కూడా పెట్టుకుంటూ సహయం చేస్తూ ఉన్నారు. మరి కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్లు కూడా డబ్బులు ఖర్చు పెట్టి సరకులూ గట్రా ఇస్తున్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ పంపకాలు సాగుతున్నాయి. అయితే ఎటొచ్చీ కుప్పంలోనే అలాంటి అలికిడి లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో మకాం పెట్టారు. అక్కడ ఆయన భ్రమల ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కనిపించడం లేదని.. కుప్పంలో మరో ఫిర్యాదు దాఖలైంది. పచ్చ మీడియాలో తప్ప చంద్రబాబు నాయుడు మరెక్కడా కనిపించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతున్నట్టుగా ఉంది!