టీడీపీ డొల్ల ప్ర‌చారాన్ని బ‌య‌ట‌పెట్టిన లోకేష్!

తెలుగుదేశం పార్టీ వాళ్లు పోల‌వ‌రం గురించి గ‌తంలో ఇచ్చిన స్టేట్ మెంట్ల‌కూ ప్ర‌స్తుతం ఆ పార్టీ నేత లోకేష్ ఆవేద‌న‌కూ పొంత‌న లేకుండా పోతోంది. పోల‌వ‌రం నిర్వాసితుల గురించి లోకేష్ స్పందించారు.  బాగానే ఉంది.…

తెలుగుదేశం పార్టీ వాళ్లు పోల‌వ‌రం గురించి గ‌తంలో ఇచ్చిన స్టేట్ మెంట్ల‌కూ ప్ర‌స్తుతం ఆ పార్టీ నేత లోకేష్ ఆవేద‌న‌కూ పొంత‌న లేకుండా పోతోంది. పోల‌వ‌రం నిర్వాసితుల గురించి లోకేష్ స్పందించారు.  బాగానే ఉంది. ఇలాంటి స‌మ‌స్య‌ల గురించి స్పందించ‌డ‌మే ప్ర‌తిప‌క్ష పార్టీ చేయాల్సిన ప‌ని. అప్పుడు ప్ర‌భుత్వం కూడా వేగంగా స్పందించే అవ‌కాశాలు పెరుగుతాయి. లోకేష్ కు మ‌రోసారి ఇలాంటి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం స్పందించ‌వ‌చ్చు.

క‌ట్ చేస్తే.. ఇక్క‌డ కొన్ని సందేహాలు మాత్రం క‌లుగుతాయి. అందులో ముఖ్య‌మైన‌ది.. పోల‌వ‌రం ప‌నులు త‌మ హ‌యాంలోనే చాలా వ‌ర‌కూ పూర్త‌య్యాయ‌ని తెలుగుదేశం వాళ్లు త‌ర‌చూ చెబుతూ ఉంటారు! జ‌గ‌న్ చేస్తున్న‌ది ఏమీ లేద‌ని.. అంతా చంద్ర‌బాబే చేసేశారంటూ ఉంటారు. ఇక టీడీపీ హ‌యాంలో పోల‌వ‌రం గురించి జ‌రిగిన హంగామా గురించి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. 

ప్ర‌తి సోమ‌వారం పోల‌వారం అన్నారు, రాసుకో జ‌గ‌న్ నీ పేప‌ర్లో పోల‌వ‌రం పూర్తియ‌పోతోంద‌న్నారు అసెంబ్లీలో, ఆ పై పోల‌వ‌రం నిర్మాణాన్ని చూసి రావ‌డానికి అంటూ ఏపీ న‌లు వైపుల నుంచి బ‌స్సుల‌ను తిప్పారు ప్ర‌భుత్వ ఖ‌ర్చుతో! అక్క‌డే జ‌య‌ము జ‌య‌ము చంద్ర‌న్న‌.. భ‌జ‌న‌ల పాట‌లు మార్మోగాయి!

అంత చేస్తే.. ఇప్పుడు నిర్వాసితుల స‌మ‌స్య అంటూ లోకేష్ స్పందించారు. మ‌రి జ‌య‌ము జ‌య‌ము చంద్ర‌న్న‌ల భ‌జ‌న‌ల స‌మ‌యంలో నిర్వాసితుల స‌మ‌స్య లేదా? కాన‌రా లేదా? పోల‌వ‌రం అంతా అప్పుడే పూర్త‌యిపోయింద‌న్నారుగా.. నిర్వాసితులను మ‌రిచారా? రాసుకో.. రాసుకో.. అన్న‌ప్పుడు నిర్వాసితుల అంశం గుర్తుకురాలేదా? అంతా చంద్ర‌బాబు హ‌యాంలోనే అయిపోయింద‌న్న‌ప్పుడు.. నిర్వాసితుల స‌మ‌స్య‌ను ఎందుకు ప‌రిష్క‌రించ‌లేదు!

ఈ అంశం మీదే లోకేషుడు మాట్లాడుతూ.. అప్పుడేమో పోల‌వ‌రానికి నిధులు రానీయ‌కుండా జ‌గ‌న్ లేఖ రాశాడ‌ట‌, ఇప్పుడేమో నిర్వాసితుల స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోలేద‌ట‌! ఇదీ ప్ర‌జ‌ల‌కు లోకేష్ చెవులో పూలు పెట్టే వైనం! చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ లేఖ రాసేస్తే నిధులు ఆపేస్తారా? ఎవ‌రికి చెబుతున్నారో ఈ కాక‌మ్మ క‌థ‌లు. ప‌నిలో ప‌నిగా లోకేష్ బ‌య‌ట‌పెడుతున్న‌ది ఏమిటంటే.. ప‌చ్చ‌బ్యాచ్ చెబుతున్న‌ట్టుగా చంద్ర‌బాబు హ‌యాంలో పోల‌వ‌రం ప‌నులేవీ పూర్తీ కాలేదు. 

గ‌త రెండేళ్ల‌లో జ‌రిగిన ప‌నులే కాదు, అతి ప్ర‌ధాన‌మైన నిర్వాసితుల స‌మ‌స్య కూడా ఇంకా అలానే ఉంది. ఆ స‌మ‌స్య ప‌రిష్కారం కాలేద‌ని స్వ‌యంగా లోకేషే చెబుతున్నాడు. అప్ప‌ట్లోనే అంతాఅయిపోయింద‌న్న సొంత పార్టీ ప్ర‌చారానికి ఆయ‌నే చెక్ పెడుతున్నాడు.