భారత ప్రభుత్వం భారీ మొత్తం వెచ్చించి నూతనంగా నిర్మించిన పార్లమెంటరీ భవన ప్రవేశ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీతో సహా 19 పార్టీలు బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించాయి. ఈ నెల 28 వ తేదీన నూతన పార్లమెంట్ భవనాన్ని మోడీ ప్రారంభించనున్నారు. ఈ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మోడీ ప్రభుత్వం నిర్మించింది. అయితే ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్న మోడీ సర్కారు ఇలా భవనాన్ని చూపి మభ్యపెట్టలేదని అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
పార్లమెంట్ చర్చా కార్యక్రమాల్లో తమకు సరైన అవకాశాలు ఇవ్వరనే కారణంతో సహా పలు అంశాలను ఆ పార్టీలు ప్రస్తావించాయి. అందులో ముఖ్యమైనది ఈ భవన ప్రవేశ కార్యక్రమంలో రిబ్బన్ కటింగ్ కూడా మోడీనే చేస్తూ ఉండటం. రాష్ట్రపతి ముర్ముకు ఈ అవకాశం ఇవ్వకుండా.. రిబ్బన్ కటింగ్ కూడా తనే చేయాలని మోడీ అనుకోవడం ప్రజాస్వామ్య పద్ధతికే అవమానం అని విపక్షాలు అంటున్నాయి. రాష్ట్రపతిని కూడా కాదని మోడీ అంతా తాను అయ్యే ప్రయత్నం చేస్తున్న ఈ ఈవెంట్ ను తాము బహిష్కరిస్తున్నట్టుగా ఆ పార్టీలు ప్రకటించాయి.
ఈ బహిష్కరణ పిలుపును ఇచ్చిన పార్టీల్లో.. కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, శివసేన(యూబీటీ), ఎస్పీ, సీపీఐ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్, వీసీకే, ఆర్ఎల్డీ, జేడీయూ, ఎన్సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఎన్సీ, ఆర్ఎస్పీ, ఎండీఎంకే వంటి పార్టీలున్నాయి. బహిష్కరణ ప్రకటనను సామూహిక ప్రెస్ నోట్ ద్వారా ఈ పార్టీలు వెల్లడించాయి.
మరి మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ఈ భవన నిర్మాణానికి విపక్ష పార్టీలు హాజరు కాకపోవడం ప్రభుత్వానికి అంత తేలికగా మింగుడుపడే అంశం కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కార్యక్రమం కేవలం అధికార పార్టీ ఈవెంట్ అయితే కాదు. మరి ఈ నెల 28న జరిగే ఈ ప్రారంభోత్సవానికి అంతర్జాతీయ కవరేజ్ కూడా లభించవచ్చు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిన అంశం చర్చనీయాంశంగా నిలుస్తుంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు