సొంత పార్టీని పెట్టుకుని గంగావతి నుంచి పోటీకి దిగిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి 2 వేలకు పైగా ఓట్ల మోజారిటీతో విజయం సాధించారు. అయితే ఆయన భార్య గాలి లక్ష్మి అరుణ మాత్రం బళ్లారి నుంచి ఓటమి పాలయ్యారు. బీజేపీను వీడి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అని ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసుకుని దాదాపు నలభై ఐదు స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపారు.
గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ వల్ల బీజేపీకి పెద్ద మొత్తంలో ఓట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 15 స్ధానాల్లో గాలి పార్టీ బీజేపీ ఓట్లు చీల్చి కాంగ్రెస్ కు లాభం చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క గంగావతిలో తప్ప.. మిగతా 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది.
మరోవైపు ఒకప్పటి గాలి అనుచరుడు బీజేపీ ముఖ్య నేత, మాజీ మంత్రి శ్రీరాములు ఈ సారి బళ్లారి రూరల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు రామనగర నుంచి పోటీ చేసిన కుమార స్వామి కొడుకు నిఖిల్ కుమార గౌడ ఓటమి పాలయ్యారు. కాగా సిద్దరామయ్యను సీఎం చేస్తే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.