దేవుడు చెప్పాడని వందే భారత్ పై రాళ్ల దాడి

వందేభారత్ రైళ్లపై రాళ్లదాడులు కొత్తేంకాదు. దాదాపు ప్రతి రూటులో వందేభారత్ పై రాళ్ల దాడులు జరిగాయి. చాలా ప్రాంతాల్లో పోలీసులు కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే బెంగళూరు రైల్వే సెక్షన్ లోని మైసూర్-చెన్నై మధ్య…

వందేభారత్ రైళ్లపై రాళ్లదాడులు కొత్తేంకాదు. దాదాపు ప్రతి రూటులో వందేభారత్ పై రాళ్ల దాడులు జరిగాయి. చాలా ప్రాంతాల్లో పోలీసులు కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే బెంగళూరు రైల్వే సెక్షన్ లోని మైసూర్-చెన్నై మధ్య వందేభారత్ రైలుపై మాత్రం రాళ్ల దాడి ఆగలేదు. మినిమం గ్యాప్స్ లో దాడులు జరుగుతూనే ఉన్నాయి.

దీంతో రైల్వే పోలీసులు ఈ లైన్లో నిఘా పెంచారు. మఫ్టీలో గస్తీ కాయడం ప్రారంభించారు. ఎలాగైతేనేం వందేభారత్ పై రాళ్లు రువ్వే వ్యక్తిని అరెస్ట్ చేశారు. రెగ్యులర్ గా అతడే ట్రయిన్ పైకి రాళ్లు రువ్వుతున్నాడనే విషయాన్ని తెలుసుకున్నారు. ఎందుకిలా చేస్తున్నావంటూ అడిగిన ప్రశ్నకు ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానంతో పోలీసులు అవాక్కయ్యారు.

వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వమని అతడికి దేవుడు చెప్పాడట. అలా చేస్తే ప్రతి రోజూ అతడికి తినడానికి తిండి దొరుకుతోందట. అందుకే ఆ రైలు వచ్చిన ప్రతిసారి దానిపైకి రాళ్లు విసురుతున్నట్టు చెప్పాడతను. ఆ వ్యక్తి పేరు అభిజిత్ అగర్వాల్, వయసు 36 ఏళ్లు. అతడికి మతిస్థిమితం లేదని పోలీసులు గుర్తించారు.

అభిజిత్ రైల్వే ట్రాక్ పక్కనే నివశిస్తున్నాడు. అక్కడే తిని, అక్కడే పడుకుంటాడు. ఈ క్రమంలో వందేభారత్ రైళ్లపై రాళ్లు విసరడం ప్రారంభించాడు. ఇలా రాళ్లు రువ్వి అలా పారిపోయేవాడు. ఎట్టకేలకు గస్తీ నిర్వహించి మరీ ఇతడ్ని పట్టుకున్నారు పోలీసులు. అతడిపై రైల్వే చట్టంలోని సెక్షన్ 147, 153 కింద కేసులు నమోదుచేశారు.