111 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ విడుదల చేసిన ఐదో జాబితాలో నటి కంగనా రనౌత్ పేరు ఉంది. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ సీటు నుంచి కంగనా పేరును బీజేపీ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ జాబితాలో ఇలా మరో నటీమణి స్థానం పొందింది.
పలు సార్లు వివాదాస్పద కామెంట్లు, మరి కొన్ని సార్లు వీర బీజేపీ భక్త స్టేట్ మెంట్లతో కంగనా రనౌత్ వార్తల్లో నిలిచింది. బీజేపీ భక్తితో గతంలో మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై కంగనా బోలెడు కామెంట్లు చేసింది. తన వివాదాస్పద కామెంట్లతో ఇతరుల నుంచి నోటీసులు అందుకుని, పరువు నష్టం దావాల్లో విచారణకు హాజరు కాకుండా కూడా కొన్నాళ్లు పాటు ఈమె వార్తల్లో నిలిచింది. మొత్తానికి ఇప్పుడు బీజేపీ తరఫున ఎంపీగా పోటీకి కంగనా అవకాశం సంపాదించేసింది!
ఇక బీజేపీ జాబితాలో టీవీ రామాయణ్ నటుడు అరుణ్ గోవిల్ కూడా ఉన్నాడు! ఇక ఐదో జాబితాకు సంబంధించిన మరో విశేషం వరుణ్ గాంధీకి టికెట్ దక్కకపోవడం. యూపీలోని పిల్ బిత్ స్థానం నుంచి వరుణ్ స్థానంలో కేంద్రమంత్రి జితిన్ ప్రసాద పేరును బీజేపీ ప్రకటించింది. అయితే వరుణ్ తల్లి మేనకగాంధీకి మాత్రం బీజేపీ టికెట్ ఖరారు చేసింది. సుల్తాన్ పూర్ నుంచి మేనక అభ్యర్థిత్వాన్ని బీజేపీ ప్రకటించింది. మరి తల్లికి టికెట్ ఖారు చేసి, కొడుకు ఝలక్ ఇచ్చింది బీజేపీ. చాన్నాళ్లుగా బీజేపీ అధిష్టానంపై వరుణ్ నిరసన వ్యక్తం చేసే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.
ఇక కర్ణాటకలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార హెగ్డేకు బీజేపీ షాక్ ఇచ్చింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో మరొకరి పేరును ప్రకటించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ వైపు వెళ్లి ఇటీవలే బీజేపీకి లోకి తిరిగి చేరిన జగదీష్షెట్టర్ కు బీజేపీ ఎంపీ టికెట్ ను ఖరారు చేయడం ఈ జాబితాలో ఉన్న మరో విశేషం! షెట్టర్ తీరుపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోడ్డుకు ఎక్కారు. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం ఆయనకు టికెట్ ను ఖరారు చేసి ఆశ్చర్యపరిచింది!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు