బీజేపీతో పొత్తు కుదరడంతో ఆ పార్టీ అభ్యర్థుల ప్రచారం నిమిత్తం కూటమి నేతలు తమిళనాడుకు వెళుతున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోయంబత్తూరు నియోజకవర్గంలో ఇటీవల నారా లోకేశ్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పార్లమెంట్ పరిధిలో తెలుగు వారు ఎక్కువగా ఉండడంతో లోకేశ్ను ఆయన పిలిపించుకున్నారు. రెండు రోజుల పాటు లోకేశ్ ప్రచారం చేశారు.
తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి మద్దతుగా జనసేనాని పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేయడానికి చెన్నైకి వెళ్లనుండడం చర్చనీయాంశమైంది. తమిళిసై చెన్నై సౌత్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. తెలుగు ప్రజానీకం ఆ పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా ఉంది. దీంతో వారి మద్దతు బీజేపీ అభ్యర్థికి కూడగట్టేందుకు పవన్కల్యాణ్ ప్రచారం చేయనున్నారు.
చెన్నై సౌత్ పార్లమెంట్ పరిధిలో పవన్కల్యాణ్ ఇవాళ రోడ్ షో చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణలో వివాదాస్పద గవర్నర్గా తమిళిసై గుర్తింపు పొందారు. కేసీఆర్ సర్కార్తో ఢీ అంటే ఢీ అని తలపడ్డారు. కేసీఆర్ సర్కార్ నుంచి వచ్చిన బిల్లులపై ఆమె సంతకాలు చేయకుండా తొక్కిపెట్టారు. దీంతో కేసీఆర్ సర్కార్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
తమిళిసై గవర్నర్గా కాకుండా, బీజేపీ నాయకురాలిగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. పలు సందర్భాల్లో ఆమె కూడా పరిధి దాటి వ్యవహరించి విమర్శలు మూటకట్టుకున్నారు. ఎన్నికలు రావడంతో తనకిష్టమైన రాజకీయాల్లోకి మళ్లీ ఆమె వెళ్లారు. పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పవన్ ప్రచారం ఆమెకు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు