ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రసంగాలు రాజకీయ నేతల ప్రసంగాలను మించి వార్తల్లో నిలుస్తున్నాయి! ఎన్నికలు నిర్వహించడం తనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటూ, వీటిని ఎవ్వరూ అడ్డుకోలేరంటూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే ఆయన సకాలంలో అనే మాటను తరచూ ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ.. సకాలంలో ఎన్నికలు జరగడం అంటే అదెప్పుడు జరగాలో అందరికీ తెలిసిందే. దానికి డేటూ, టైమ్ వేరే ఉన్నాయి.
ఎన్నికలు తనకు నిర్వహించాలనుకున్నప్పుడు నిర్వహించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కే కావొచ్చు. కానీ, ఏపీలో స్థానిక ఎన్నికలకు సకాలం మాత్రం ఇది కాదని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. చివరగా కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగాయి.
ఆ లెక్కల ప్రకారం.. మూడేళ్ల కిందటే ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహించాల్సింది. అయితే అప్పట్లో ఎన్నికలు ప్రభుత్వానికి పట్టలేదు. మరి అప్పుడు కూడా ఎస్ఈసీగా ఉండిన నిమ్మగడ్డ ఏం చేశారు? అనేది ప్రాథమికమైన ప్రశ్న.
ఇప్పుడు పదే పదే సకాలం అంటూ స్పందిస్తున్న ఆయన, అప్పుడేం చేశారు? అని ఒక ఓటర్ ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏమని చెబుతారో వినాలని ఉంది. కానీ ఆ టాపిక్ గురించి ఆయన మాట్లాడటం లేదు. సకాలం అంటే.. ఇదే అన్నట్టుగా ఏ మాత్రం తర్కానికి అందుబట్టని విధంగా ఉంది ఆయన స్పందన.
ఆయన ఎన్నికల కమిషనర్ అయితే కావొచ్చు కానీ, ప్రజలు ప్రతి ఒక్కరి డ్యూటీ గురించి కూడా తార్కికంగానే ఆలోచిస్తారు. అలా ఆలోచించకూడదని మాత్రం నిమ్మగడ్డ ఏ రాజ్యాంగం నుంచి ఆదేశాలను తీసుకురాలేరు. ఎందుకంటే తార్కిక ఆలోచనను పెంచుకోవడం కూడా రాజ్యాంగం భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక విధుల్లో ఒకటి.
ఇక తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడప జిల్లా పర్యటన సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తావన తీసుకురావడం గమనార్హం. వైఎస్ హయాంలో తను ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసినట్టుగా నిమ్మగడ్డ చెప్పారు.
వైఎస్ లౌకికంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. తనపై నమ్మకం ఉంచారని, నిలబెట్టుకున్నట్టుగా చెప్పారు నిమ్మగడ్డ. మీ వాళ్లూ, మా వాళ్లూ అంటూ మాట్లాడటం తగదు అని నిమ్మగడ్డ హిత వచనాలు చెప్పారు. ఈ మాటలన్నీ నర్మగర్భంగా ఉన్నాయి. ఈ మాటలతో నిమ్మగడ్డ ఏదో చెప్పాలని అనుకుంటున్నారేమో అనిపిస్తుందని పరిశీలకుల మాట.