పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి ఆరు రోజుల సమయం చాలన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలన్న తపనతోనే ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ పట్ల నిమ్మగడ్డ అనాసక్తి ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత.
స్థానిక ఎన్నికల నిర్వహణ ద్వారానే తెలుగుదేశానికి మేలు చేయాలని నిమ్మగడ్డ అనుకున్నారని, పదవిని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరించడానికి కుదరదని హై కోర్టు తీర్పుల ద్వారా నిమ్మగడ్డకు అర్థమై ఉండాలని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఆరు రోజుల వ్యవధిలో నిర్వహించగల ఎంపీటీసీ, జడ్పీ ఎన్నికలను పూర్తి చేసి నిమ్మగడ్డ పదవీ విరమణ చేయాలని తాము కోరుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.
ఇక ఏపీలోని మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ల ఎన్నికకు సంబంధించి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ప్రతి మున్సిపాలిటీకీ ఇద్దరు డిప్యూటీ చైర్మన్లు, కార్పొరేషన్లకు ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉంటారని ఆయన ప్రకటించారు.
ఏతావాతా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలోనే వీలైనంత త్వరగా ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని స్పష్టం అవుతూ ఉంది. మరి అధికార పార్టీ సై అంటోంది, దానికి నిమ్మగడ్డ సై యేనా?