తిరుపతి బై పోల్ విషయంలో చంద్రబాబు నాయుడుకు ఒక స్ట్రాటజీ ఉందంటున్నారు. జనసేన అక్కడ పోటీ చేయడమే చంద్రబాబు స్ట్రాటజీ. ఇప్పటి వరకూ చంద్రబాబు జేబులో మనిషిగానే వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ కూడా తన పార్ట్ నర్ కోరిక మేరకే వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి.
పవన్ కల్యాణ్ ను బీజేపీ పంచన చేర్చిన చంద్రబాబు నాయుడే ఇప్పుడు తిరుపతిలో బీజేపీ మద్దతుతో జనసేన నిలబడాలనే లెక్కలు వేశారనే మాట బలంగా వినిపిస్తూ ఉంది. అయితే పవన్ కల్యాణ్ కు బీజేపీ వాళ్లు అతిగా విలువను ఇవ్వడం లేదు. ఈ విషయం మాత్రం స్పష్టం అవుతోంది.
తిరుపతి ఎంపీ టికెట్ విషయంలో ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి జనసేన అధినేత తమ కోరికను మొరపెట్టుకున్నారు. అయితే అక్కడ నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ వస్తున్న దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో ఈ అంశంపై అటో ఇటో తేల్చుకోవడానికి పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. బీజేపీ నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ కోరికను బీజేపీ తీర్చే అవకాశాలు లేవని పరిణామాలను గమనిస్తున్న చిన్న పిల్లాడు కూడా చెబుతాడు. తిరుపతి బరిలోకి దిగి ఏపీలో ప్రతిపక్షం తామే అని నిరూపించుకోవాలనే ఉబలాటంటో ఉంది బీజేపీ. కాబట్టి.. పవన్ కల్యాణ్ కోరికను ఆ పార్టీ తీర్చే అవకాశాలు లేవు.
అయితే పవన్ కల్యాణ్ మాత్రం ప్రయత్నాలను ఆపడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేసి సాధించింది ఏమీ లేదు. తను కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడినప్పటికీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే తన సత్తా అంతా బయటపడుతుందని పీకే భావిస్తున్నట్టుగా ఉన్నారు. ఇదంతా చంద్రబాబు స్కెచ్ ప్రకారం జరుగుతున్న ప్రచారం ఉండనే ఉంది. అయినా పవన్ మాత్రం బీజేపీతో చర్చలకు దిగారు.
మరి రేపు బీజేపీ తమ అభ్యర్థే బరిలో ఉండాలని జనసేనకు స్పష్టం చేస్తే? అప్పుడు జనసేన ఏం చేయగలదు? బీజేపీని కాదని పోటీకి దిగేంత సీన్ ఉందా? అంటే అదెలాగూ ఉండదు. దానికి చంద్రబాబు కూడా ఒప్పుకోరు. అంతిమంగా బీజేపీకే మద్దతు అని ప్రకటించడం తప్ప పవన్ కల్యాణ్ కు మరో ఛాయిస్ కూడా లేదు.