ఎక్కడైనా భార్యాభర్తలు విడిపోయిన కేసుల్లో ఏం జరుగుతుంటుందో మనందరికీ తెలిసిందే. భార్య పోషణ కోసం భర్త భరణం చెల్లిస్తూ ఉంటాడు. భర్త అంటే కుటుంబ పోషకుడిగా, యజమానిగా ఇంటి సభ్యుల మంచీచెడూ చూసే వ్యక్తిగా మన సమాజం ఓ గుర్తింపునిచ్చింది.
ఏవైనా కారణాలతో దంపతులు కలిసి ఉండలేమనే పక్షంలో విడాకులు తీసుకునేందుకు వెళ్తారు. అప్పుడు ఆ భర్త ఆదాయాన్ని బట్టి భరణం కింద భార్యకు ఎంత మొత్తం చెల్లించాలో ఫ్యామిలీ కోర్టు తేల్చి చెబుతుంది.
అయితే దీనికి విరుద్ధంగా ఓ భార్యకు ఫ్యామిలీ కోర్టు షాక్ ఇచ్చింది. భర్తకు భరణం చెల్లించాలని ఉత్తరప్రదేశ్లోని ఓ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫరాబాద్ ఫ్యామిలీ కోర్టుకు ఓ జంట వెళ్లింది.
చాలా ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్న ఆ భార్యాభర్తలు తమకు విడాకులు ఇవ్వాలని కోరారు. అయితే హిందూ వివాహ చట్టం-1955 కింద ప్రభుత్వ పెన్షనర్ అయిన భార్య నుంచి తనకు భరణం ఇప్పించాలని ఆమె భర్త 2013లో పిటిషన్ దాఖలు చేశాడు.
దీనిపై ఏడేళ్ల పాటు విచారణ చేసిన ఫ్యామిలీ కోర్టు తాజాగా ఓ వినూత్న తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన ఆమెకు ప్రతినెలా రూ.12 వేలు పెన్షన్ వస్తుండడం, మరోవైపు భర్తకు ఎలాంటి ఆదాయం లేకపోవడాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని తుది తీర్పునిచ్చింది.
తన భర్తకు నిర్వహణ ఖర్చుల కింద ప్రతినెలా రూ. 1000 చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇది ఒకింత వింతగా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య సంపాదనపరురాలై, ఎలాంటి ఆదాయం లేని భర్తలు వేరుగా ఉంటే ...హిందూ వివాహ చట్టం-1955 కింద భార్య నుంచి భరణం పొందవచ్చనే సరదా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు