రాజధాని అమరావతిపై పచ్చ దళానికి కేంద్ర ప్రభుత్వం షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత చట్టసభా వేదికగా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం రాజధానిపై ఇచ్చిన క్లారిటీ అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న వారి మైండ్ బ్లాక్ చేసిందని చెప్పొచ్చు.
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీ విభజన చట్టం అమలుపై సభ్యులు కీలక ప్రశ్నలు సంధించారు. ఇందులో భాగంగా బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు… ఆయన ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్ణయాధికారంపై జీవీఎల్ సంధించిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ కీలక సమాధానం ఇచ్చారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని నిత్యానందరాయ్ తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి అమరావతినే ఏపీ రాజధాని అని అయన పేర్కోన్నారు.
కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు… ఏపీ అధికార పార్టీ నిర్ణయానికి తగ్గట్టు సమాధానం రావడం విశేషం. అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణల నేపథ్యంలో ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని జగన్ సర్కార్ తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ మినహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి.
అయితే ఒక రాజకీయ పార్టీగా అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరుకుంటున్నామని, కానీ కేంద్ర ప్రభుత్వంగా మోడీ సర్కార్ రాష్ట్ర నిర్ణయాల్లో జోక్యం చేసుకోదంటూ ఏపీ బీజేపీ నేతలు సరికొత్త నాటకానికి తెరతీసిన సంగతి తెలిసిందే.
తాజాగా మరోసారి రాజధానిపై రాజ్యసభలో జీవీఎల్ ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చిందో తెలియదు. కానీ రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే అని కేంద్రం స్పష్టం చేయడంపై టీడీపీ ఆగ్రహంగా ఉంది. ఇదంతా వైసీపీ, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాగా టీడీపీ విమర్శిస్తోంది.