వైఎస్సార్సీపీపై ట్రెండింగ్ ప‌దాన్ని వాడేస్తున్న టీడీపీ!

ప్ర‌పంచంలో ఏ మూల ఏం జ‌రిగినా.. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనూ ముడిపెట్ట‌డం తెలుగుదేశం పార్టీకి అల‌వాటు. ఇది ఇప్ప‌టి క‌థ కాదు.…

ప్ర‌పంచంలో ఏ మూల ఏం జ‌రిగినా.. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనూ ముడిపెట్ట‌డం తెలుగుదేశం పార్టీకి అల‌వాటు. ఇది ఇప్ప‌టి క‌థ కాదు. దాదాపు పుష్క‌ర‌కాలంగా ప్ర‌పంచ ప‌రిణామాలు, చ‌ర్చ‌కు వ‌చ్చిన పేర్ల‌ను-ఉదంతాల‌ను జ‌గ‌న్ కు ముడి పెట్టి టీడీపీ శుద్దులు చెబుతూ ఉంటుంది.

అప్పుడెప్పుడో ట్రావెన్ కోర్ వంశం వారు… అనంత‌ప‌ద్మ‌నాభ స్వామి ఆస్తుల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని స్టేట్ మెంట్ ఇస్తే దాన్ని కూడా జ‌గ‌న్ కు ముడి పెట్టారు టీడీపీ నేత‌లు. ట్రావెన్ కోర్ రాజుల్లాగా జ‌గ‌న్ కూడా త‌న ఆస్తుల‌ను ప్రభుత్వానికి అప్ప‌గించేయాల‌ని అప్ప‌ట్లో టీడీపీ నేత‌లు స్టేట్ మెంట్లు ఇచ్చారు. 

ఇంకా ఎక్క‌డో ఏదో జ‌రిగితే.. దానికీ జ‌గ‌న్ కు కూడా ఏదో ఒక అన్వ‌యం టీడీపీ నుంచి ఉంటుంది! ఇలా ట్రెండ్ ను మిస్ కాదు టీడీపీ. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ట్రెండ్ లో ఉన్న తాలిబ‌న్ల‌ను కూడా టీడీపీ వాడేసుకుంటోంది. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల‌న తాలిబ‌న్ల‌ను త‌ల‌పింప‌జేస్తోందంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించారు. ఇలా మ‌రోసారి జాతీయ‌, అంత‌ర్జాతీయ ట్రెండింగ్ అంశాన్ని టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్వ‌యించింది. ప్ర‌పంచంలో ఏ మూల చీమ చిటుక్కుమ‌న్నా.. దాన్ని టీడీపీ వాళ్లు వ‌ద‌ల‌రు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ముడిపెడుతూ ఉంటారు.

అయితే ఈ గోరంత‌లు కొండ‌తలు చేయ‌డం, చెప్ప‌రా చెప్ప‌రా బోలిగా అంటే.. టంగుటూరి మిరియాలు తాటికాయ‌లంత‌.. అనే రేంజ్ లో టీడీపీ హ‌డావుడి చేయ‌డంతో అస‌లు వ్య‌వ‌హారం సిల్లీగా మారిపోతూ ఉంటుంది. 

ఏదో సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టుగా, వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఏదైనా మాట్లాడితే ప్ర‌జ‌లు సీరియ‌స్ గా తీసుకుంటారు. అంతే కానీ.. ఏదో వార్త‌ల్లో క‌నిపించిన దాన్నంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టేయ‌డం ద్వారా టీడీపీ ఏదో వినోద కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టుగా సాగుతోంది వ్య‌వ‌హారం!