టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పాడె మోసి కడసారి వీడ్కోలు పలికారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.
దయాకర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొనేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని పర్కాపురంలో దయాకర్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చిన దయాకర్ రెడ్డి మూడుసార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అమరచింత నుంచి రెండుసార్లు మక్తల్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.