తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్ట్, సెకెండర్ ఇయర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించారు. తెలంగాణలో పరీక్షల నిర్వహణ పెద్ద సవాల్గా నిలిచిన సంగతి తెలిసిందే. వివిధ పరీక్షలు లీక్ కావడం తీవ్ర దుమారం రేపింది. ఇదిలా వుండగా ఇంటర్ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ప్రతిభచాటడం విశేషం.
ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4,33,08 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,72,208 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 62.85శాతంగా నమోదైంది. సెకెండర్కు వచ్చే సరికి 3,80,920 మందికి 2,56,241 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 67.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణతతో పోలిస్తే ఐదు శాతం ఎక్కువ నమోదు కావడం విశేషం. అలాగే రెండు సంవత్సరాల్లో బాలికలే హవా కనబరిచారు.
ఫస్ట్ ఇయర్లో బాలికల ఉత్తీర్ణత 68 శాతం, బాలురు 56.82 శాతం నమోదైంది. అలాగే సెకెండ్ ఇయర్లో బాలికలు 73.46%, బాలురు 60.66 % ఉత్తీర్ణత నమోదైంది. రెండింటిలోనూ బాలికలే సత్తా చాటినట్టైంది. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత తగ్గింది. ఫస్టియర్ లో 2శాతం, సెకెండ్ ఇయర్లో 1శాతం ఉత్తీర్ణత తగ్గింది.
జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని, విద్యార్ధులు బాగా చదివి మంచి మార్కలను సాధించాలని మంత్రి కోరారు. ఇంటర్ సెకెండ్ ఇయర్లో ఫెయిలైన విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దనే ఉద్దేశంతో ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలిగించామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.