కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. పార్లమెంట్ సమావేశాలు మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడటంతో ప్రధానిని కోమటిరెడ్డి కలిశారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించినట్లు చెబుతున్నా.. ప్రధానితో భేటీలో రాజకీయాలు మాట్లాడే ఉంటారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భేటి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలతో పాటు మూసీ నది ప్రక్షాళన, విజయవాడ హైవే విస్తరణ, యాదాద్రి కి ఎంఎంటీఎస్ పొడిగించాలని కోరినట్లు ఆయన చెప్పారు. అలాగే కొన్ని అంశాలు మీడియాతో చెప్పలేనివి అని.. తను అడిగిన అన్ని అంశాలపై ప్రధాని చాలా సానుకూలంగా స్పందించారన్నారు. అలాగే రాష్ట్రంలో వడగళ్ల వానతో రైతులు నష్ట పోయారని.. కేంద్రం నుంచి పరిశీలనకు బృందాన్ని పంపాలని కోరానన్నారు.
కాగా వెంకటరెడ్డి సోదరుడు, రాజగోపాల్ రెడ్డి బీజేపీ కొనసాగుతున్నా దృష్ట వెంకటరెడ్డి కూడా పార్టీ మారనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నా ఆయన మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఆయనపై అనుమానంతో పార్టీ కమిటీల్లో కూడా ఎక్కడ చోటు కల్పించలేదు. కాంగ్రెస్ పార్టీలో రచ్చ జరుగుతున్న సమయంలో ఆయన మరోసారి ప్రధానిని కలవడంతో చర్చనీయాంశంగా మారింది.