సూర్యోదయంతో అతని బతుకు తెల్లారింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ లోన్ రికవరీ వేధింపులు తాళలేక గన్తో పాయింట్ బ్లాక్లో కాల్చుకుని శాశ్వతంగా ఈ లోకాన్ని వీడాడు. ఈ దుర్ఘటన కన్న కూతురు ఎదుటే జరగడం గమనార్హం. తన తండ్రి ఆత్మహత్యకు బ్యాంక్ అధికారుల లోన్ రికవరీ వేధింపులే కారణమని గన్మెన్ కుమార్తె ఆరోపించింది.
వివరాల్లోకి వెళితే…మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద ఏఆర్ ఎస్ఐ ఫజల్ అలీ ఎస్కార్క్ అధికారి. శ్రీనగర్ కాలనీలో అతని నివాసం. కుటుంబ అవసరాల నిమిత్తం లోన్యాప్లో రూ.3 లక్షలు లోన్ తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ మొత్తాన్ని చెల్లించినా, ఇంకా రూ.10 లక్షలు ఇవ్వాలని రికవరీ అధికారులు తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని మృతుడి కుమార్తె తెలిపారు. దీంతో తన తండ్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని ఆమె తెలిపారు.
డ్యూటీకి ఉదయం కూతురిని కూడా గన్మెన్ వెంటబెట్టుకెళ్లాడు. శ్రీనగర్ కాలనీలో మణికంఠ హోటల్లో వద్ద అతను పాయింట్ బ్లాక్ రేంజ్లో గన్తో కల్చుకొని ప్రాణాలు విడిచాడు. గన్మెన్ ఆత్మహత్య సమాచారాన్ని అందుకున్న మంత్రి సబితా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ను అడిగి మంత్రి వివరాలు తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, లోన్ వేధింపులే కారణమని మంత్రికి వివరించారు.