తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ అంటే వైఎస్ షర్మిల నిప్పులు కురిపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ సర్కార్ ఉనికిని గుర్తించడానికి కూడా షర్మిల ఇష్టపడడం లేదు. సీఎం కుర్చీలో నుంచి కేసీఆర్ ఎప్పుడెప్పుడు దిగిపోతారా? అని షర్మిల ఎదురు చూస్తున్నారని, ఆమె పరుష పదజాలాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు.
పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె ఘాటు ట్వీట్లతో కేసీఆర్, కేటీఆర్ను ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. మీకు సిగ్గుంటే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ సాగిన షర్మిల ట్వీట్ల సంగతేంటో చూద్దాం.
“గ్రూప్-1 పరీక్షలు రాయొద్దని, ప్రత్యేక తెలంగాణలో రాసుకుందామని యువతను పెడదోవ పట్టించిన దుర్మార్గుడు కేసీఆర్ కాదా? తొమ్మిదేండ్లుగా ఒక్క గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని దద్దమ్మ కేసీఆర్ కాదా? కొలువులు ఇవ్వకుండా వందలాది మంది నిరుద్యోగుల ఉసురుతీసిన ఘనత కేసీఆర్ది కాదా? ఆత్మహత్య చేసుకున్న ఒక్క కుటుంబాన్నైనా పరామర్శించారా? ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని యువతను వంచించింది కేసీఆర్ కాదా?
బిస్వాల్ కమిటీ లక్షా 91వేల ఖాళీలు ఉన్నాయన్నది వాస్తవం కాదా? దేశంలో ఎంప్లాయ్ మెంట్ పాలసీ తీసుకురావాలంటున్న చిన్నదొర కేటీఆర్, రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పండి. TSPSC ప్రశ్నాపత్రాలకు డిజిటల్ సెక్యూరిటీ కల్పించకపోవడం ఐటీ మంత్రిగా మీ వైఫల్యం కాదా?యువతను బలిపశువులను చేసింది కేసీఆర్ ఐతే, అదే యువత ఉద్యోగ ఆకాంక్షలను పాతరేసింది కేటీఆర్. మీకు సిగ్గుంటే ముక్కునేలకు రాసి, యువతకు క్షమాపణ చెప్పి, లక్షా 91వేల ఖాళీలకు నోటిఫికేషన్లు ఇచ్చి, నిరుద్యోగ భృతి అమలు చేయండి “
పెద్ద దొర కేసీఆర్, చిన్న దొర కేటీఆర్లపై షర్మిల విమర్శలు ఎంత వాడి, వేడిగా వున్నాయో గమనించొచ్చు. తెలంగాణలో నిరుద్యోగ యువత దుస్థితికి కేసీఆర్ సర్కారే కారణమని ఆమె గాఢమైన అభిప్రాయం. అందుకే ముక్కు నేలకు రాసి, యువతకు క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్. కేసీఆర్ సర్కార్పై విమర్శలు చేయడానికి ఆమెకు ఇతరేతర కారణాలేవైనా ఉన్నాయా? అనే అంశం చర్చనీయాంశమైంది.