గులాబీ పార్టీ కీలక నిర్ణయం … ఇక కొత్త చరిత్ర

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించగానే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. మునుగోడు ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించకపోయినా గుడ్డిలో మెల్ల అన్నట్లుగా గెలిచింది. టీఆర్ఎస్…

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించగానే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. మునుగోడు ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించకపోయినా గుడ్డిలో మెల్ల అన్నట్లుగా గెలిచింది. టీఆర్ఎస్ అదే ఘనవిజయంగా భావించి సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీని బలంగా దెబ్బ కొట్టానని కేసీఆర్ భావిస్తున్నారు. తనకు తిరుగు లేదనుకుంటున్నారు. జాతీయ పార్టీని ఆవిష్కరించడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నారు. ఇక జాతీయ స్థాయిలో తన సత్తా చూపించాలనుకుంటున్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారుస్తూ బహిరంగంగా ప్రకటించారు.

పార్టీ పేరు మార్పుపై టీఆర్ఎస్ బహిరంగ ప్రకటన జారీ చేసింది. పార్టీ పేరును 'భారత్‌ రాష్ట్ర సమితి'గా మారుస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. అధ్యక్షుడు కేసీఆర్‌ పేరిట జారీ అయిన ఈ ప్రకటనలో పార్టీ కొత్త పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే పంపాలని అందులో సూచించారు. అభ్యంతరాలను 30 రోజుల్లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధలన ప్రకారం.. ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి పేరు మార్పు, ఇతరత్రా సవరణలు ఉంటే వాటిపై అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. దీనికోసం స్థానిక పత్రికలతో పాటు ఆంగ్ల పత్రికల్లోనూ సదరు పార్టీ ప్రకటనలు ఇవ్వాలి.

ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈసీ ప్రకటన జారీ చేసింది. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఆయన గుజరాత్‌ మోడల్‌కు పోటీగా తెలంగాణ మోడల్‌ను దేశం ముందు ఆవిష్కరిస్తున్నారు గుజరాత్ మోడల్ అంతా గోల్ మాల్ అంటున్నారు. తెలంగాణ మోడల్ అచ్చమైన అభివృద్ధి అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి 967 ప్రాంతాలు ఫ్లోరోసిస్‌ బాధిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ సమస్యను తీర్చడంలో కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది. ప్రస్తుతం తెలంగాణలో ఫ్లోరోసిస్‌ బాధిత ప్రాంతాలు సున్నా అని జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితమేని టీఆర్ఎస్ చెబుతోంది. 

మానవ వికాసం, ప్రజాసంక్షేమం, సామరస్యం లక్ష్యంగా కేసీఆర్‌ ప్రజారంజక పాలనను అందిస్తున్నారు. ఆయన పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నివర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దేశ ప్రజలందరూ తెలంగాణ ప్రజా సంక్షేమ అభివృద్ధిని, కేసీఆర్‌ నమూనాను కోరుకుంటున్నారని టీఆర్ఎస్ వాదన. తెలంగాణ వ్యవసాయరంగ అభివృద్ధికి కేసీఆర్‌ ఏం చేశారో కళ్ల ముందు కనిపిస్తోందని టీఆర్ఎస్ చెబుతోంది.  తెలంగాణ వ్యవసాయరంగంలో కేసీఆర్‌ది ఒక సువర్ణ అధ్యాయం. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌తో పాటుగా, గ్రామాల్లోనే పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. సాగునీటి రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అద్భుత ప్రగతిని సాధించింది.

కేసీఆర్‌ అవలంబించిన ఈ వ్యవసాయ నమూనా తమకూ కావాలని దేశవ్యాప్తంగా రైతాంగం కోరుకుంటున్నదని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా రైతాంగం వెన్ను విరిచేలా, వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టేలా బీజేపీ నల్ల చట్టాలు తెచ్చే ప్రయత్నం చేసి దేశవ్యాప్తంగా రైతాంగం నుంచి తీవ్ర నిరసనలు రావడంతో చివరికి వెనుకడుగు వేసిందని..గుర్తు చేస్తోంది. తమ మోడలే రైతుల్ని ఆకట్టుకుంటుందని చెబుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. విద్యుత్‌రంగాన్ని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగా బీజేపీ ఉచిత విద్యుత్‌ నిలిపివేసి మోటర్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రాలకు హుకుం జారీ చేసింది. 

కేంద్రం తెలంగాణ ధాన్యాన్ని కొనేందుకు విముఖత చూపిందని దీన్ని దేశ ప్రజలు గుర్తిస్తారని అంటోంది. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలంటే అందుకు కేసీఆరే ప్రత్యామ్నాయం అని యావత్‌ దేశం బలంగా విశ్వసిస్తున్నది. అందుకు మునుగోడు నుంచే తొలి అడుగు దేశవ్యాప్తంగా పడిందని టీఆర్ఎస్ నమ్మకంగా ఉంది. ఇప్పటికే తెలంగాణ మోడల్‌లో తొలి హామీ దేశవ్యాప్తంగా అందరికీ ఉచిత విద్యుత్, రైతు బీమా అని కేసీఆర్ ప్రచారం కూడా చేస్తున్నారు. దీనిపై జాతీయ మీడియాలో చర్చ కూడా జరిగింది. అందుకే మునుగోడుతో .. తెలంగాణ మోడల్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుందని.. టీఆర్ఎస్ నమ్మకంగా ఉంది.