కేసీఆర్ నంబర్ వన్.. రేవంత్ రెడ్డి నంబర్-2

ప్రచార హోరు ముగిసింది. హైదరాబాద్ తో పాటు పల్లెలన్నీ ప్రశాంతంగా మారాయి. అభ్యర్థులంతా తమ “బూత్ లెవెల్ మేనేజ్ మెంట్” లో నిమగ్నమైపోయారు. ఈసారి ప్రచారంలో ఎవరు ముందున్నారు.. ఎక్కువగా ఎవరు తిరిగారు.. ఎవరు…

ప్రచార హోరు ముగిసింది. హైదరాబాద్ తో పాటు పల్లెలన్నీ ప్రశాంతంగా మారాయి. అభ్యర్థులంతా తమ “బూత్ లెవెల్ మేనేజ్ మెంట్” లో నిమగ్నమైపోయారు. ఈసారి ప్రచారంలో ఎవరు ముందున్నారు.. ఎక్కువగా ఎవరు తిరిగారు.. ఎవరు ఎన్ని మీటింగ్స్ లో పాల్గొన్నారు..?

ఎన్నికల ప్రచారంలో కేటీఆర్, హరీష్ రావు ముందున్నారు. వీళ్లు చెరో 60 రోజుల పాటు ప్రచారం చేశారు. అయితే మీటింగ్స్ విషయంలో మాత్రం సీఎం కేసీఆర్ దే పైచేయి. ప్రచారం చేసింది 32 రోజులే అయినప్పటికీ.. 96 బహిరంగ సభలు నిర్వహించారు కేసీఆర్.

కేసీఆర్ తర్వాత స్థానం రేవంత్ రెడ్డిది. ఆయన 44 రోజుల్లో 87 సభలు నిర్వహించారు. రేవంత్ తర్వాత హరీశ్ రావు 80 సభలు నిర్వహించి మూడో స్థానంలో నిలిచారు. 

ఇక కేటీఆర్ విషయానికొస్తే.. 60 రోజుల పాటు కలియతిరిగిన కేటీఆర్, 70 రోడ్ షోలు చేసి, 30 సభలు నిర్వహించారు. అటు కవిత 70 సభల్లో పాల్గొన్నారు. 

రాహుల్ గాంధీ 8 రోజుల్లో 25 సభలు నిర్వహించగా.. ప్రధాని మోదీ 5 రోజుల్లో 8 సభలు, అమిత్ షా 8 రోజుల్లో 17 బహిరంగ సభలు నిర్వహించారు. మల్లికార్జున ఖర్గే 10, ప్రియాంక గాంధీ 26 సభల్లో పాల్గొన్నారు. 

అభ్యర్థులు.. ఆస్తులు.. అక్షరాస్యులు.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తమ ఆస్తులకు సంబంధించి వీళ్లంతా ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు సమర్పించారు. వాటి ప్రకారం చూసుకుంటే, అభ్యర్థుల్లో 25 మంది వద్ద ఎలాంటి ఆస్తిపాస్తుల్లేవు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. తమ దగ్గర చిల్లిగవ్వ లేదని వాళ్లు ప్రకటించారు.

మరో ముగ్గురు అభ్యర్థులు మాత్రం తమ వద్ద 500 రూపాయలు మాత్రమే ఉన్నట్టు ప్రకటించుకున్నారు. ఇక బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 580 మంది కోటీశ్వరులున్నారు. మొత్తం అభ్యర్థుల్లో 89 మంది నిరక్షరాస్యులు కూడా ఉన్నారు.