Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఆ 2 సినిమాలు చూసి బంగారం కొట్టేశారంట!

ఆ 2 సినిమాలు చూసి బంగారం కొట్టేశారంట!

సికింద్రాబాద్ లో 3 రోజుల కిందట సినీ ఫక్కీలో జరిగిన బంగారం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగుర్ని అరెస్ట్ చేయడంతో పాటు.. 6 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. సినిమాలు చూసి వీళ్లు ఈ దొంగతనానికి పాల్పడిన విషయాన్ని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

ఈనెల 27న సికింద్రాబాద్ లోని ఓ బంగారం షాపులో చోరీ జరిగింది. ఇన్ కం ట్యాక్స్ అధికారులమంటూ ఒకరి తర్వాత ఒకరిగా 10 మంది షాపులోకి ప్రవేశించారు. మోండా మార్కెట్లో రద్దీగా ఉన్నప్పటికీ, పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ వీళ్లు ప్లాన్ ను అమల్లోకి తెచ్చారు.

బంగారం కొనుగోళ్లలో అవకతవకలు ఉన్నాయని, షాపును సీజ్ చేస్తున్నామని బిల్డప్ ఇచ్చారు. 1700 గ్రాములకు ఎలాంటి రశీదులు, ట్యాక్సులు లేవంటూ.. ఆ బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వెళ్తూ, షాపును బయట నుంచి షట్టర్ వేసి వెళ్లారు. చుట్టుపక్కల షాపులో పనిచేస్తున్న వాళ్ల సహాయంతో షట్టర్ ఓపెన్ చేయించాడు,బంగారం షాపు యజమాని వికాస్.

స్థానికులిచ్చిన సమాచారంతో మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే దొంగలు మహారాష్ట్ర పారిపోయారని గుర్తించి, స్పెషల్ ఫోర్స్ ను మహారాష్ట్రకు పంపించారు.

జాకీర్, రహీమ్, ప్రవీణ్, అక్షయ్ అనే నలుగురు దొంగల్ని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. వీళ్ల నుంచి కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాల్ని వెల్లడించిన సీవీ ఆనంద్.. స్పెషల్ ఛబ్బీస్, గ్యాంగ్ అనే సినిమాలు చూసి వీళ్లు ఈ దోపిడీకి పాల్పడినట్టు ప్రకటించారు. మిగిలిన దొంగల్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?