జగన్ సర్కార్, ఎస్ఈసీ మధ్య పంచాయతీ ఎన్నికల పంచాయితీ మరోసారి హైకోర్టు చేరింది. రాష్ట్రంలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్కుమార్ శుక్రవారం రాత్రి ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది.
పంచాయతీ ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరుపుతామని న్యాయస్థానం ప్రకటించింది.
ఇటీవల ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే కరోనా మహమ్మారి ప్రభావం, టీకా షెడ్యూల్ తదితర కారణాలను చూపుతూ ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదని , ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్ నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
దీనిపై విచారించిన హైకోర్టు ఇరువర్గాలు కూర్చుని ఎన్నికల నిర్వహణపై చర్చించుకోవాలని, ఇందుకు ముగ్గురు సీనియర్ అధికారులను ఎస్ఈసీ వద్దకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతినిధులుగా చీఫ్ సెక్రటరీతో పాటు గ్రామీణ, వైద్యశాఖలకు చెందిన ఇద్దరు అత్యున్నత అధికారులను ఎస్ఈసీ వద్దకు పంపింది.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని, కావున వాయిదా వేయాలని, మరో దఫా చర్చలు జరుపుదామని ఎస్ఈసీకి చెప్పడంతో పాటు, తమ ఇబ్బందులను నివేదిక రూపంలో సమర్పించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ ముగిసిన గంట సమయానికే ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ ప్రకటించారు.
దీన్ని బట్టి నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఫ్రీ ప్లాన్గా ఎన్నికల షెడ్యూల్ను సిద్ధంగా ఉంచుకున్నట్టు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను నిలుపుదల చేయాలని హైకోర్టును ఏపీ సర్కార్ ఆశ్రయించింది. సోమవారం హైకోర్టులో విచారణ, న్యాయస్థానం వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.