పంచాయతీ ఎన్నికల్లో తనకు తిరుగులేదని అధికార పార్టీ వైసీపీ రుజువు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికలైనా, స్థానిక ఎన్నికలైనా గెలుపు తనదేనని వైసీపీ బల్లగుద్ది మరీ చాటుకుంది.
పల్లెపై తన పట్టు ఎంత బలంగా ఉందో పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ మరోమారు చాటి చెప్పింది. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలంటే వైసీపీ భయపడుతోందని ప్రతిపక్షాలు గత కొంత కాలంగా చేస్తున్న విమర్శలకు పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఫలితాలతో దీటైన సమాధానం చెప్పి నోళ్లు మూయించింది.
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ పోలింగ్ నిన్న ముగిసింది. ఫలితాలు అర్ధరాత్రి వరకూ వెలువడుతూనే ఉన్నాయి. టీడీపీ అనుకూల మీడియా ఎన్నికల ఫలితాలే వైసీపీకి తిరుగులేదని చెబుతుండడం గమనార్హం.
తొలి విడత 3,249 గ్రామాల్లో ఎన్నికలు జరిగితే, 525 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అందులో 98 శాతం మేర అంటే 518 సర్పంచ్ పదవులు వైఎస్సార్సీపీ అభిమానులే కైవసం చేసుకున్నారు. తొలి విడతలో మంగళవారం 2692 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు 2294 గ్రామాల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో… వైసీపీ మద్దతుదారులు 1716 గ్రామాల్లో సర్పంచులుగా విజయం సాధించారు. టీడీపీ మద్దతుతో 465 మంది , ఇతరులు 119 స్థానాల్లో గెలుపొందారు.
వైసీపీ ఏకపక్ష విజయాలు గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఎంత బలంగా ప్రజాదరణ పొందాయో అర్థమవు తోంది. పేరుకు పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలే అయినా ….ప్రధాన పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులే బరిలో నిలిచారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలపై ఆదరాభిమానాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతున్నాయి.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల అమలుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. జగన్ నిబద్ధతకు నిదర్శనంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.