తిరుపతి ఉప ఎన్నిక ముంగిట టీడీపీ అధినేత చంద్రబాబుకు వీడియో లీక్ పితలాటకం తగులుకుంది. తనపై రాళ్ల దాడికి తెగబడ్డారనే ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలనుకున్న చంద్రబాబుకు రివర్స్ అటాక్ ఎదురైంది. దీంతో చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులన్నీ ఖంగుతిన్నాయి. తిరుపతిలోని ఓ హోటల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడితో పార్టీ నేత ఆకుల వెంకటేశ్వరరావు జరిపిన సంభాషణ కెమెరాకెక్కింది.
లోకేశ్పై ఆకుల వెంకటేశ్వరరావు నోరు పారేసుకోవడంతో పాటు అచ్చెన్నాయుడు పార్టీకి భవిష్యత్ లేదంటూ నిర్వేదంతో అన్న మాటలకు సంబంధించి వీడియో సోషల్ హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో లోకేశ్పై తాను పరుష పదజాలం వాడడంతో పాటు అచ్చెన్నతో పార్టీ వ్యతిరేక మాటలు మాట్లాడించిన ఆకుల వెంకటేశ్వరరావుకు ప్రాణ భయం పట్టుకుంది.
ఈ నేపథ్యంలో నిన్న రాత్రి తన ప్రాణాలను కాపాడాలంటూ ఆయన తిరుపతి వెస్ట్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు చంద్రబాబు నుంచి ప్రాణహాని వుందని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. వీడియో లీక్ అయినప్పటి నుంచి తనకు టీడీపీ ముఖ్య నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన చెప్పుకొచ్చాడు. తాను జూబ్లీహిల్స్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేశానన్నాడు. 30 ఏళ్లుగా తాను టీడీపీలో కష్టపడి పని చేశానన్నాడు. చంద్రబాబు, అచ్చెన్నాయుడులకు అత్యంత సన్నిహితుడైన కేఎల్ నారాయణ అనే వ్యక్తి జూబ్లీహిల్స్లోని తన 400 గజాల స్థలాన్ని కబ్జా చేశాడని వాపోయాడు. దీనిపై చంద్రబాబుతో పాటు బాలకృష్ణకు కూడా పలుమార్లు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేదన్నాడు.
ఇదే విషయమై అచ్చెన్నాయుడితో కూడా ఆకుల వెంకటేశ్వరరావు మొర పెట్టుకోవడం వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. మొత్తానికి ఒకే ఒక్క వీడియో తిరుపతి ఉప పోరులో టీడీపీకి భారీ డ్యామేజీ కలిగించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. రాజకీయ చదరంగంలో చంద్రబాబు ఎత్తులు చిత్తు అవుతున్నాయనేందుకు తాజా వీడియోనే నిదర్శనం.
ఆకు ముల్లు మీద పడ్డా; ముల్లు ఆకు మీద పడ్డా…ఆకుకే నష్టమనే సామెత ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఆకులపై టీడీపీ పడినా, టీడీపీపై ఆకు పడినా ….అంతిమంగా చంద్రబాబుకే నష్టమని చెప్పక తప్పదు.