ఏపీపీఎస్సీలో ఏం జరుగుతోంది..?

ఉద్యోగ కల్పనలో అవినీతి, అక్రమాలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలనే సీఎం సంకల్పానికి వ్యతిరేకంగా ఏపీపీఎస్సీలో ఒక కీలక వ్యక్తి వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగుతూ ఉంది. ఆయనే ఏపీ పీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్. లక్షలాది…

ఉద్యోగ కల్పనలో అవినీతి, అక్రమాలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలనే సీఎం సంకల్పానికి వ్యతిరేకంగా ఏపీపీఎస్సీలో ఒక కీలక వ్యక్తి వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగుతూ ఉంది. ఆయనే ఏపీ పీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్. లక్షలాది మంది యువత జీవితాలను నాశనం చేసేలా ఆయన వ్యవహరిస్తున్నాడనే ప్రచారం సాగుతూ ఉంది.  రాజకీయ అండదండలతో పదవుల్లోకి వచ్చిన ఏపిపీఎస్సీ చైర్మన్ చేష్టలు నిరుద్యోగులను రోడ్లపాలు అయ్యేలా చేస్తున్నాడనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. 

నాలుగుళ్లుగా ఆ హోదాలో ఉన్న ఆయన ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని సమాచారం. ప్రత్యేకించి ఒక సామాజికవర్గానికి కొమ్ముకాస్తూ నిరుద్యోగ యువతియువకుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు.  తన వర్గం వారికే ఎక్కువ మార్కులు వచ్చేలా కోచింగ్ సెంటర్లతో ఒప్పందాలు చేసుకొని విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టాడనే ఆరోపణలు ఆయన విషయంలో వినిపిస్తుండటం ఒక సంచలనమే. చట్టవిరుద్ధమైన పనులకు కేరాఫ్ అడ్రస్గా మారాడట ఉదయ్ భాస్కర్. 

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎంపీగా ఉండి, ఆ పార్టీ అధికారం కోల్పోయాకా బీజెపిలో ఎంపీగా చలామణి అవుతున్న సుజనా చౌదరి రికమండేషన్తో ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యారు ఉదయ్ భాస్కర్. నియామకం రోజునుంచే వివాదాస్పద నిర్ణయాలు, తన సామాజిక వర్గానికి మాత్రమే లాభం చేకూర్చేలా ఒంటెత్తు పోకడలు ఉదయ్ భాస్కర్ చేపట్టారని తెలుస్తోంది.

ఎన్నికల తరువాత ప్రభుత్వం మారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక గత ప్రభుత్వంలో నియమించిన నామినేటెడ్ పోస్టులో ఉన్నవారంతా రాజీనామాలు చేశారు. కొంతమంది తప్పుకున్నారు. అయితే డా॥ ఉదయ్ భాస్కర్ మాత్రం ఏపీపీఎస్సీ చైర్మన్ పదవిని పట్టుకుని వేలాడుతున్నారు. సంస్థలో ఉదయ్ భాస్కర్ తీసుకున్న/ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. 

చైర్మన్ హోదాలో మిగిలిన సభ్యులతో కనీస సంప్రదింపులు జరపకుండ గ్రూప్1,2,3 పరీక్షలకు సంబంధించిన సిలబస్ను అనేకసార్లు మార్చుతూ తమ జీవితాలను పణంగా పెట్టారని ఆయన విషయంలో విద్యార్థులు వాపోతున్నారు. పదే పదే సిలబస్ మార్చడం మూలంగా విద్యార్థులు ఈ పరీక్షలకు ఏ సిలబస్ చదువుకోవాలో తెలియక గందరగోళంలో పడ్డారు.  

ఇక ప్రశ్నాపత్రాల తయారీలో సబ్జెక్ట్లో లేనటువంటి ప్రశ్నలను గ్రూప్ 1 పరీక్షలో పొందుపరిచారు. ఈ ప్రశ్నాపత్రంలో 25 తప్పులు రావడంతో అనేక మంది విద్యార్థులు నష్టపోయారు.  గ్రూప్ 1 పరీక్షలోనే కాకుండా ఏపీపీఎస్సీ నిర్వహించిన అన్నిపరీక్షల్లో అనేక పొరపాట్లు, తప్పుల తడకగా ఉన్న ప్రశ్నలు అతని హయాంలోనే జరిగింది.  ఏపీపీఎస్సీ గ్రూప్ సభ్యులను సంప్రదించకుండ నెగెటివ్ మార్క్స్ విధానాన్ని ప్రవేశపెట్టడం మూలంగా అనేక మంది విద్యార్థులు నష్టపోయారు. ఇందులో అధికంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయి. 

పరీక్ష తేదిల ప్రకటనలో కూడా అతను తీసుకొనే నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఇక ఏపీపీఎస్సీ చైర్మన్ హోదాలో.. 8 మంది సభ్యులతో పాటు శాశ్వత ఉద్యోగులను సంప్రదించకుండా నియంతృత్వ ధోరణిలో నిర్ణయాలు తీసుకుంటున్నారట ఉదయ్ భాస్కర్. దాంతో పాటు సంస్థలో కమ్మ సామాజికవర్గానికి సంబంధించిన ఉద్యోగులకు మాత్రమే ప్రమోషన్లు ఇస్తూ మిగిలిన సామాజికవర్గాల ఉద్యోగులను అన్యాయానికి గురిచేస్తున్నాడు. దీంతో వారంతా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు!