Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ :జయలలిత ఒడిదుడుకులు

ఎమ్బీయస్‌ :జయలలిత ఒడిదుడుకులు

జయలలితకు ప్రస్తుతం బెయిల్‌లో వున్నారు. ఇక్కణ్నుంచి జైలుకి వెళ్లాలో లేదో త్వరలోనే తేలుతుంది. ఏది ఏమైనా పదేళ్లపాటు ప్రభుత్వపదవులు చేపట్టే అవకాశం కనబడటం లేదు. పదవి లేకపోతే పార్టీపై ఆమె పట్టు నిలుస్తుందా? శివసేన బాల ఠాక్రే రిమోట్‌ కంట్రోలు చేతిలో పెట్టుకోవడంతో తృప్తిపడ్డారు. జయలలిత అలా తృప్తి పడగలదా? ఆమెలో మంచీ, చెడూ రెండూ వున్నాయి. మేధస్సు, వక్తృత్వం, పట్టుదల, కార్యదీక్ష, పరిపాలనా దక్షతతో బాటు, అవినీతి, ఆశ్రితపక్షపాతం, శత్రువులను సహించలేకపోవడం, అహంభావం, మొండివైఖరి కూడా వున్నాయి. ఏది ఏమైనా ఆమె ఒక బలీయమైన శక్తి. అయితే అది ప్రతికూల పరిస్థితుల్లో నుండి సేకరించిన శక్తి. అదీ విశేషం! ఆమె తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి సినిమాల్లో పాత్రలు వేసేది. హీరోయిన్‌ వేషాలు కాదు. సాధారణ వేషాలు. డబ్బుకి కాస్త కటకటే. అందుకే జయలలిత బాగా చదువుకుంటున్నా, యింకా చదువుకుంటానని మొత్తుకున్నా తల్లి బలవంతంగా ఆమెను సినిమాల్లో ప్రవేశపెట్టింది. తల్లి మాట కాదనలేక సినిమాల్లోకి వచ్చినా ఆమె ఆ రంగాన్ని ప్రేమించినట్లు ఎక్కడా కనబడదు. ఏ సినిమాను డైరక్టు చేయలేదు, తీయలేదు. దాన్ని ఒక వృత్తిగా, ధనార్జనకు సాధనంగా మాత్రమే చూసింది. కెమెరా ముందుకి పిలిచినపుడు వచ్చి నటించడం, విరామం వచ్చినపుడు ఒంటరిగా కూర్చుని చదువుకోవడం అదే ఆమెకు తెలుసు. 140 సినిమాల్లో వేసినా సహ నటీనటులతో స్నేహంగా వున్నదీ లేదు, వివాదాలు తెచ్చుకున్నదీ లేదు. దీనికి మినహాయింపులు లేకపోలేదు. తమిళ నటుడు చో రామస్వామి  ఆమెకు సన్నిహితుడుగా, హితైషిగా వుండేవాడు. శోభన్‌బాబుతో అయితే స్నేహానికి మించిన బంధం. ఎమ్జీయార్‌తో అయితే జీవితకాలపు అనుబంధం. 

16 వ యేట ఆమె సినిమాల్లోకి హీరోయిన్‌గా వచ్చిన తొలిరోజుల్లోనే ఎమ్జీయార్‌ కంటపడింది. అప్పటిదాకా బి.సరోజాదేవితో వరుసగా పదేళ్లపాటు సినిమాలు వేస్తూ వచ్చిన ఎమ్జీయార్‌ తన కంటె 31 ఏళ్ల చిన్నదైన యీమెతో ''ఆయురత్తిల్‌ ఒరువన్‌'' (1965) సినిమాతో జతకట్టాడు. ఆ సినిమా, ఆ జంట సూపర్‌హిట్‌ కావడంతో అప్పణ్నుంచి 1972 వరకు 28 సినిమాల్లో ఏకధాటీగా తన పక్కన హీరోయిన్‌గా వేషాలిప్పించాడు. జయలలిత ఒక్కసారిగా తారాపథానికి దూసుకుపోయింది. తెలుగులో ఏకంగా నాగేశ్వరరావు పక్కన  హీరోయిన్‌గా ''మనుషులు-మమతలు''లో నటించి యిక్కడా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ అగ్రతారలందరి సరసన నటించింది. ఎమ్జీయార్‌ ఆమెపై మక్కువ చూపాడు కానీ బహిరంగంగా పెళ్లి చేసుకోలేదు. అప్పటికే అతని మొదటి భార్య పోయింది. ఓ సినిమాలో తన పక్కన నాయకిగా వేసిన వివాహితురాలు జానకిని రెండో భార్యగా చేసుకున్నాడు. జయలలితను ప్రేయసిగానే చూశాడని తమిళప్రజలు నమ్మారు. కాదు, తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని జయలలిత అతని మరణం తర్వాత క్లెయిమ్‌ చేసింది. ఏది ఏమైనా ఎమ్జీయార్‌ జయలలితకే కట్టుబడి లేడు. ఆమె తర్వాత మంజులను తన సరసన హీరోయిన్‌ ఐదేళ్ల కాంట్రాక్టులో తీసుకున్నాడు. ఆమె తర్వాత లతను...! ''డాక్టర్‌ బాబు''(1973) టైములో శోభన్‌బాబుకు జయలలితతో స్నేహం పెరిగింది. కానీ ఎమ్జీయార్‌కు కోపం వస్తుందన్న భయంతో అతనూ దూరమై పోయాడు. ఎమ్జీయార్‌ తనను సొంత ఆస్తిగా చూస్తూ, ఎవరినీ దగ్గరకు రానీయకుండా చేస్తూ, అదే సమయంలో తను మాత్రం స్వేచ్ఛగా వర్తిస్తూ, తనను హింసిస్తున్నాడన్న కోపం ఆమెను దహించి వేస్తుండగానే తల్లి మరణించి మరింత ఒంటరి అయిపోయింది. 1980 నాటికి సినిమా కెరియర్‌ దాదాపు ముగిసిపోయింది.

ఎమ్జీయార్‌ తొలిథలో కాంగ్రెస్‌వాది. తర్వాత ద్రవిడ కళగంలో చేరాడు. అణ్నాదురై ఆ సంస్థలో నుండి బయటకు వచ్చి డిఎంకె పెట్టినపుడు దానిలో సభ్యుడిగా వున్నాడు. ప్రచారకర్తగా వుండి, పార్టీ విజయానికి దోహదపడ్డాడు. 1967 ఎన్నికలలో డిఎంకె నెగ్గి అధికారంలోకి వచ్చింది. రెండేళ్ల తర్వాత అణ్నా చనిపోయినపుడు ముఖ్యమంత్రిగా ఎవరవుతారనే ప్రశ్న వచ్చినపుడు తన స్నేహితుడు కరుణానిధికి మద్దతుగా నిలబడ్డాడు. అయితే కరుణానిధి ఎమ్జీయార్‌ పాప్యులారిటీ చూసి అసూయపడి అతనికి చిక్కులు కలిగించాడు. ఎమ్జీయార్‌ విడిగా వచ్చి అన్నాడిఎంకె పార్టీ పెట్టాడు. ఉపయెన్నికలలో నెగ్గుతూ వచ్చి 1977 ఎన్నికలలో అధికారం సంపాదించి, పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఎమ్జీయార్‌ నిర్వ్యాపారంగా, బేలగా, ఒంటరిగా వున్న జయలలిత పట్ల కారుణ్యం చూపాడు. 1982లో జయలలితను రాజకీయాల్లోకి ఆహ్వానించాడు. మరుసటి ఏడాదే ప్రాపగాండా సెక్రటరీగా నియమించాడు. ఆమె సభల్లో పాల్గొని చక్కటి ఉపన్యాసాలతో ప్రజలను ఆకట్టుకోసాగింది. ఆమె అందం, సినిమా గ్లామర్‌, చక్కటి ఉచ్చారణ, అయిదారు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే చాకచక్యం యివన్నీ ఆమెకు ప్రత్యేక స్థానాన్ని సంతరించి పెట్టాయి. 

Click Here For Greatandhra E-paper

ఇది పార్టీలో సీనియర్లను మండించింది. ద్రవిడ పార్టీలన్నీ బ్రాహ్మణ వ్యతిరేకత అనే పునాదిపై ఏర్పడినవే. నాయకుల్లో ఎవ్వరూ బ్రాహ్మణులు లేరు. ఎమ్జీయార్‌ ఎడిఎంకె పెట్టాక వ్యతిరేకత కాస్త పలుచబడింది. తన వ్యక్తిగత వైద్యుడైన హండేను కన్నడ బ్రాహ్మణుడైనా ఫర్వాలేదని కాబినెట్‌లోకి తీసుకున్నాడు. ఇప్పుడు జయలలిత కూడా బ్రాహ్మణురాలే. పైగా ఆమె కన్నడిగురాలనే వాదం కూడా వుంది. ఇలా అయితే మన పార్టీ పరువేం కాను అని వాళ్లు గోలపెట్టినా లెక్కపెట్టకుండా ఎమ్జీయార్‌ జయలలితను 1984లో రాజ్యసభ ఎంపీగా చేశాడు. రాజ్యసభలో అద్భుతమైన మేధోప్రదర్శనతో,  విషయపరిజ్ఞానంతో, వక్తృత్వంతో ఆమె అందర్నీ ముగ్ధులను చేసింది. ఆమెకు పేరు వస్తున్న కొద్దీ అహంభావం మరింత పెరుగుతోందని, ఎమ్జీయార్‌ మరింతగా ఆదరించేట్లు వున్నాడని భయపడిన పార్టీ సీనియర్లు ఆమెకు వ్యతిరేకంగా ఎమ్జీయార్‌కు చాడీలు చెప్పసాగారు.

Click Here For Greatandhra E-paper

1987 డిసెంబరులో ఎమ్జీయార్‌ హఠాత్తుగా చనిపోయాడు. ఆ వార్త వింటూనే జయలలిత వెళ్లి ఎమ్జీయార్‌ శవం తల వద్ద నిలబడింది. టీవీలో అతని శవం కనబడుతున్నంతసేపూ తల వద్ద ఆమె కనబడడంతో ఆమెయే అసలైన వారసురాలు అనే అభిప్రాయం ప్రజల మెదళ్లలో పొజిషన్‌ అయిపోయింది. ఇది గ్రహించిన జానకి, వీరప్పన్‌ మనుష్యులు అంత్యక్రియల సమయంలో  శవం వున్న గన్‌ క్యారేజి నుంచి ఆమెను బలవంతంగా దింపేశారు. దాన్ని అవమానంగా చిత్రీకరించి ఆమె ప్రజల సానుభూతిని చూరగొంది. పార్టీ నిట్టనిలువుగా చీల్చింది. అప్పటిదాకా రాజకీయాలంటే ఓనమాలు తెలియని జానకిని ముఖ్యమంత్రిగా పెట్టి వీరప్పన్‌ చక్రం తిప్పాడు.  తర్వాత వచ్చిన ఎన్నికలలో ఎమ్జీయార్‌ వారసురాలు నేనంటే నేనని జానకి, జయలలిత పోటీపడ్డారు. వీళ్లిద్దరి మధ్య ఎడిఎంకె ఓట్లు చీలిపోవడంతో మధ్యలో డిఎంకె లాభపడి కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు. జయలలిత ప్రతిపక్ష నాయకురాలైంది. జానకి రాజకీయాలకు స్వస్తి చెప్పి పార్టీని జయలలితకు అప్పగించేసింది. వీరప్పన్‌ ఎటూకాకుండా పోయాడు. 1989 మార్చి 25 న కరుణానిధి అసెంబ్లీలో బజెట్‌ ప్రసంగం చేస్తూండగా జయలలిత లేచి అడ్డుతగిలి ప్రశ్నలడగసాగింది. కరుణానిధి హేళనగా ''పోయి శోభన్‌బాబుని అడుగు'' అన్నాడు. చిర్రెత్తిన జయలలిత తన పార్టీ సభ్యులను 'కొట్టండిరా' అని ఆదేశించింది. కొందరు కరుణానిధిపైకి లంఘించారు. డిఎంకె సభ్యులు అడ్డుగా నిలిచారు. బాహాబాహీ యుద్ధం జరుగుతున్న సమయంలో పిడబ్ల్యుడి మంత్రి దురై మురుగన్‌ జయలలితపై పడి ఆమె చీర కొంగు లాగాడు. అంతే ఆమె ఉగ్రరూపం ధరించి బయటకు వచ్చి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ''దుశ్శాసనులున్న యీ సభలో మళ్లీ అడుగుపెడితే ముఖ్యమంత్రిగానే అడుగుపెడతాను'' అని శపథం చేసింది. రెండేళ్ల తర్వాత ఆమె శపథం నెరవేరింది.

1991లో ఆమె ముఖ్యమంత్రి అయ్యాక ఎమ్జీయార్‌ను పొగడడం తగ్గించింది. స్వీయప్రచారం చేసుకుంటూ, పాదాభివందనాలు చేయించుకుంటూ, అవినీతికి ఆశ్రితపక్షపాతానికి పాల్పడుతూ చాలా చెడ్డపేరు తెచ్చుకుంది. 1996 ఎన్నికలలో కాంగ్రెసుతో కలిసి పోటీ చేస్తే నాలుగు అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 39 పార్లమెంటు సీట్లలో ఒక్కటీ దక్కలేదు.  బర్గూర్‌ సీటులో స్వయంగా ఓడిపోయింది. కానీ తర్వాతి వచ్చిన కరుణానిధి ప్రభుత్వం యింతకంటె అధ్వాన్నంగా వుండడంతో 2001 ఎన్నికలలో ఆమె పార్టీ గెలిచింది. ముఖ్యమంత్రిగా వుండగానే కేసులు ఎదుర్కోవలసి వచ్చి పన్నీర్‌ శెల్వంను కూర్చోబెట్టింది. కేసుల్లో నెగ్గాక మళ్లీ ముఖ్యమంత్రి అయింది. తనను జైలుకి పంపిన కరుణానిధిని కూడా అర్ధరాత్రి అరెస్టు చేయించి జైల్లో పెట్టించింది. ఈసారి పాలనలో పరిపాలనా సామర్థ్యం పెంచుకుని, అవినీతి ఆరోపణలు రాకుండా చూసుకున్నా ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో ఓడిపోయింది. ఐదేళ్ల తర్వాత 2011 లో మళ్లీ అధికారం చేపట్టింది. ఇలా అధికారం ఆమెతో నిరంతరం దోబూచులాడుతూనే వుంది. ఆమె గతంలో చేసిన పాపాలు యింకా వెంటాడుతూనే వున్నాయి. ఆమె మనసు, ఆలోచనాధోరణి ఎటువంటిదో ఎవరికీ అంతుపట్టదు. అయితే ప్రజల్లో మాత్రం ఆమె పట్ల అపారమైన సానుభూతి వుంది. కరుణానిధి అంటే యిష్టపడనివారికి మిగిలిన మార్గం జయలలితను సమర్థించడం ఒక్కటే. తక్కిన పార్టీలన్నీ సోదిలోకి లేకుండా పోయాయి. ప్రజాదరణ, పార్టీ నాయకుల బానిసత్వం ఎలా వున్నా న్యాయస్థానాల తీర్పుకు లోబడవలసినదే కదా. ఈ గతుకుల బాటపై జయలలిత గమనం సాగుతూనే వుంది. భయపడి చేతులెత్తేసే రకం కాదామె. పోరాడుతూనే వుంటుంది. దాని పర్యవసానం తెరపై చూడాల్సిందే. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?