మెగా రీ-ఎంట్రీ.. మళ్ళీ సస్పెన్స్‌

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల్లో రీ-ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు.? అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకడంలేదు. ఇదిగో అదిగో.. అంటూనే ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఏడెనిమిదేళ్ళ క్రితం చిరంజీవి చివరిసారిగా పూర్తిస్థాయి హీరోగా చిరంజీవి కన్పించారు. అది…

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల్లో రీ-ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు.? అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకడంలేదు. ఇదిగో అదిగో.. అంటూనే ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఏడెనిమిదేళ్ళ క్రితం చిరంజీవి చివరిసారిగా పూర్తిస్థాయి హీరోగా చిరంజీవి కన్పించారు. అది కూడా ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ సినిమాలో. అప్పటినుంచీ ఇప్పటిదాకా తమ అభిమాన హీరోని తెరపై చూసుకోవాలన్న అభిమానుల కోరిక మాత్రం నెరవేరడంలేదు.

మొన్నటిదాకా వినాయక్‌ డైరెక్షన్‌లో చిరంజీవి సినిమా చేస్తారన్న ప్రచారం జరిగింది. అది కాస్తా తుస్సుమంది. పూరి జగన్నాథ్‌ పేరు తెరపైకొచ్చింది. అధికారికంగా చిరంజీవి, పూరి జగన్నాథ్‌ ఈ విషయాన్ని ఖరారు చేశారు కూడా. మళ్ళీ ఏమయ్యిందో ఇప్పుడు దర్శకుడు మారుతున్నాడట. వినాయక్‌తోనే సినిమా చేయాలన్న ఆలోచనతో చిరంజీవి వున్నారట. ఎందుకు? అన్నదానికి సమాధానమైతే దొరకడంలేదు.

ఈ సస్పెన్స్‌కి తెరదించేందుకు అతి త్వరలో రామ్‌చరణ్‌ మీడియా ముందుకు వస్తాడన్నది తాజా ఖబర్‌. తన తండ్రి నటించే 150వ సినిమాకి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరించనున్న విషయం విదితమే. చూద్దాం.. ఈ గందరగోళానికి చరణ్‌ అయినా తెరదించుతాడో లేదో.!