కృష్ణవంశీ దారేది?

పైసా సినిమాని విడుదల చేయలేక నానా కష్టాలు పడుతున్న కృష్ణవంశీకి మరో కొత్త సమస్య ఎదురైంది. మల్టీ స్టారర్‌ సినిమా చేద్దామని సర్వం సన్నద్ధం చేసుకొంటుంటే.. అందులోంచి ఒక్కో నటుడూ బయటకు వెళ్లిపోతున్నాడు. వెంకటేష్‌…

పైసా సినిమాని విడుదల చేయలేక నానా కష్టాలు పడుతున్న కృష్ణవంశీకి మరో కొత్త సమస్య ఎదురైంది. మల్టీ స్టారర్‌ సినిమా చేద్దామని సర్వం సన్నద్ధం చేసుకొంటుంటే.. అందులోంచి ఒక్కో నటుడూ బయటకు వెళ్లిపోతున్నాడు. వెంకటేష్‌ – రామ్‌చరణ్‌ – కృష్ణ లతో త్రయం సినిమా చేద్దామనేది కృష్ణవంశీ ఆలోచన. రామ్‌చరణ్‌ ఈ ప్రాజెక్టుకు ముందే ఓకే చెప్పాడు. అయితే.. కృష్ణ మాత్రం ఈ సినిమా నుంచి ముందే తప్పుకొన్నారు. ఇప్పుడు వెంకీ కూడా అదే బాట పట్టాడు. దాంతో అయోమయంలో పడ్డాడు కృష్ణవంశీ.

కృష్ణ వంశీ క్రియేటివిటీపై స్టార్లకు నమ్మకాలు తగ్గిపోతున్నాయి. నిజానికి స్టార్‌ హీరోలను సరిగా డీల్‌ చేసిన దాఖలాలు కృష్ణవంశీకి లేనేలేవు. ఒక్క నాగార్జునతో మాత్రం నిన్నే పెళ్లాడతాతో హిట్‌ కొట్టాడు. రెండోసారి చంద్రలేఖ ఆ క్రెడిట్‌ అంతా పోయేటట్టు చేసిందనుకోండి… అది వేరే విషయం. ప్రభాస్‌, ఎన్టీఆర్‌లకు హిట్లు ఇవ్వలేకపోయాడు. అందుకే స్టార్‌ హీరోలు కృష్ణవంశీ జోలికి వెళ్లడానికి ఒకట్రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే. మొగుడు సినిమా తరవాత కృష్ణవంశీపై పూర్తిగా నమ్మాకాలు తగ్గిపోయాయి. చరణ్‌ ఎలా టెమ్ట్‌ అయ్యాడో గానీ.. త్రయం కథకు ఓకే చెప్పాడు. మరి మిగతా ఇద్దరూ ఏరి..?  నానితో తీసిన పైసా సినిమాపై కూడా ఎవరికీ హోప్స్‌ లేవు. ఉంటే ఈ పాటికి బయటకు వచ్చేసేదే. అటు తీసిన సినిమా బయటకు రాలేదు. ఇప్పుడు తీయబోయే సినిమాకి ఎన్నో ఆటంకాలు.. పాపం.. క్రియేటీవ్‌ దర్శకుడికి ఎన్ని కష్టాలొచ్చాయో..?

అయినా ఇప్పుడు కృష్ణవంశీకి కావల్సింది స్టార్లు కారు. నిజానికి కృష్ణవంశీ సినిమాలో స్టార్‌ బలం లేకపోయినా ఫర్లేదు. సింధూరంలో ఎంతమంది స్టార్లున్నారు…? ఆ సినిమా చూళ్లేదా..?  ఇప్పుడు కృష్ణవంశీ నమ్ముకోవల్సింది కంటెంట్‌ని మాత్రమే. అతని ఆలోచనలు గొప్పగా ఉంటాయనేది కాదనలేని వాస్తవం. కమర్షియల్‌ దర్శకుడిగా నిరూపించుకోవాలని వాటిని పక్కన పెట్టేశాడు. మళ్లీ వాటి బూజు దులపాలి. కొత్తవారితో ఓ అద్భుత దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించాలి. ఇది కృష్ణవంశీకి కష్టమైన విద్యేం కాదు. స్టార్‌ ల వెంట పడకుండా… తన కంటెంట్‌నే స్టార్‌గా నమ్ముకొంటే.. పాత కృష్ణవంశీని చూడొచ్చు. మరి కృష్ణవంశీ ఏమంటాడో..?