నీచంగా తిడితే తప్ప ఎమ్మెల్యేలను నమ్మలేం!

ప్రజల రాజకీయాలు, సంక్షేమ రాజకీయాలు, బిస్కట్ రాజకీయాలు ఇవన్నీ కూడా పాతపడిపోయాయి. ఇప్పుడన్నీ దూషణ రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే… మనలో ఎంతటి సేవాభావం ఉన్నదో ప్రజలకు చెప్పుకుంటే సరిపోదు. ఎదుటివాడు ఎంతటి…

ప్రజల రాజకీయాలు, సంక్షేమ రాజకీయాలు, బిస్కట్ రాజకీయాలు ఇవన్నీ కూడా పాతపడిపోయాయి. ఇప్పుడన్నీ దూషణ రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే… మనలో ఎంతటి సేవాభావం ఉన్నదో ప్రజలకు చెప్పుకుంటే సరిపోదు. ఎదుటివాడు ఎంతటి దుర్మార్గుడో చాలా నీచంగా తిట్టగలగాలి.. అదొక్కటే తారక మంత్రం.

ఇది అభ్యర్థుల పరిస్థితి అయితే.. పార్టీల పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రత్యర్థి పార్టీని దారుణంగా తిట్టేవాళ్లను తప్ప, తమ పార్టీలో ఉన్న మరెవ్వరినీ నమ్మలేకపోతున్నారు. ప్రత్యర్థి పార్టీని దారుణంగా తిట్టడంలో కాస్త మొహమాట పడే నాయకుడు ఎవరైనా ఉంటే.. ఏ క్షణాన అతడు పార్టీ ఫిరాయించేస్తాడో అని అనుమానంగా చూస్తున్నారు.

ఇధి ప్రస్తుతం తెలంగాణలో ఉన్న వాతావరణం. రేవంత్ సర్కారు యాభైరోజులుగా పరిపాలన సాగిస్తోంది. అప్పుడే ఈ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టిపోయినట్లుగా ప్రజలను నమ్మించడానికి గులాబీదళాలు నానా పాట్లు పడుతున్నాయి.

రేవంత్ సర్కారు భ్రష్టు పట్టిపోయిందని చెప్పడం మాత్రమే కాదు. అది అతిత్వరలో కూలిపోతుందని కూడా చాటిచెప్పడం పాపం గులాబీ దళపతులకు అవసరంగా కనిపిస్తోంది. రేవంత్ సర్కారు త్వరలో కూలిపోతుంది అని ముందుగా తమ సొంత పార్టీని నమ్మించాలని అనుకుంటున్నారు. ఎందుకంటే.. తమ పార్టీలోనుంచి ఎందరు ఎమ్మెల్యేలు కాంగ్రెసులోకి వెళ్లిపోతారోనని వారికి భయం.

అసలే ఇటీవల నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లి రేవంత్ ను కలవడాన్నే జీర్ణించుకోలేకపోయారు. వారితో వరుస ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ సర్కారును తిట్టించే ప్రయత్నం చేశారు. అయినా నాయకుల కష్టం ఫలించలేదు. అభివృద్ధి పనులకోసం వెళ్లాం తప్ప, ఫిరాయించేది లేదు- అని వారు అన్నారు తప్ప, సర్కారును తిట్టిపోయలేదు.

తమ పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరూ కాంగ్రెసులోకి ఫిరాయించకుండా ఉండాలంటే ముందు వారందరితోనూ రేవంత్ ప్రభుత్వాన్ని దారుణంగా తిట్టించడం, విఫల ప్రభుత్వంగా అభివర్ణింపజేయడం టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ నేతల పురమాయింపులకు గులాబీల్లో పెద్దగా స్పందన లేదు. రేవంత్ సర్కారు విఫలమైందని కేటీఆర్, హరీష్ కొన్ని వందల సార్లు అంటున్నారే తప్ప.. ఆ స్థాయిలో తిడుతున్న మరొక ఎమ్మెల్యే ఆ పార్టీలో లేరు.

మరొకవైపు పార్లమెంటు ఎన్నికల తర్వాత.. భారాస మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని కాంగ్రెస్ మంత్రులు పదేపదే అంటూ ఉండడం కూడా గమనార్హం. వలసవచ్చే గులాబీలకు కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరవడం గ్యారంటీ. అయితే ఈ ఆకర్ష మంత్రంతో ఎంతమందిని తమలో కలిపేసుకోగలరు.. గులాబీ దళాలను ఎంతగా బలహీన పరచగలరు అనేదే చర్చ నడుస్తోంది.

మొత్తానికి ఎమ్మెల్యేలు తమ జట్టులో స్థిరంగా ఉన్నారని నమ్మాలంటే.. ప్రత్యర్థిని తిట్టించడం ఒక్క్టటే దళపతులకు మార్గంగా కనిపిస్తోంది పాపం!