సాయి ధరమ్ తేజ్ హారతి.. వివాదంలో శ్రీకాళహస్తి

సెలబ్రిటీలు వచ్చినప్పుడు అధికారులు, పోలీసులు చేసే హంగామా అందరికీ తెలిసిందే. అదే ఓ హీరో వస్తున్నాడంటే ఆ 'అతి' ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఆచారాల్ని తుంగలో తొక్కడమే కాస్త బాధాకరం.…

సెలబ్రిటీలు వచ్చినప్పుడు అధికారులు, పోలీసులు చేసే హంగామా అందరికీ తెలిసిందే. అదే ఓ హీరో వస్తున్నాడంటే ఆ 'అతి' ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఆచారాల్ని తుంగలో తొక్కడమే కాస్త బాధాకరం. ఈరోజు సాయిధరమ్ తేజ్ విషయంలో  అదే జరిగింది.

శ్రీకాళహస్తిలో సందడి చేశాడు సాయితేజ్. రాహుకేతు పూజ చేయడంతో పాటు, స్వామివారిని దర్శించుకున్నాడు. ఈ క్రమంలో సాధారణ భక్తులకు కాస్త అసౌకర్యం కలిగిన మాట వాస్తవం. సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఆమాత్రం అసౌకర్యం సహజం. కాకపోతే ఆలయ నిబంధనలు, ఆచారాల్ని కూడా పక్కనపెట్టడం విడ్డూరం.

హారతిచ్చిన సాయితేజ్..

స్వామివారిని దర్శించుకునే క్రమంలో ఉపాలయంలో ఉన్న చంగల్ రాయ స్వామి (సుబ్రమణ్యేశ్వర స్వామి) దగ్గరకు వచ్చాడు సాయితేజ్. వెంటనే అక్కడున్న సిబ్బంది సాయితేజ్ చేతికి హారతి పల్లెం అందించారు. స్వయంగా సాయితేజ్ చేతుల మీదుగా స్వామివారికి హారతి ఇప్పించారు.

ఈ విషయంలో నిబంధనల్ని, ఆలయ ఆచారాల్ని అధికారులు, అర్చకులు పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాళహస్తిలో కేవలం అర్చకులు మాత్రమే పూజలు చేసి హారతులు ఇవ్వాలని, సామాన్య జనం హారతి ఇవ్వడం నిషిద్దమని అంటున్నారు కొంతమంది అర్చకులు. ఇందులో వాస్తవం ఎంత, శాస్త్రాలు ఏం చెబుతున్నాయనే విషయంపై ప్రస్తుతానికైతే స్పష్టత లేనప్పటికీ, విమర్శలు మొత్తం మొదలైపోయాయి. 

శ్రీకాళహస్తిలో ఇలాంటివి మామూలే..

ఇప్పటివరకు ఏ సెలబ్రిటీ ఇలా ప్రవర్తించలేదని, సాయితేజ్ విషయంలో మాత్రం అధికారులు, అర్చకులు అత్యుత్సాహం చూపించారనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఈ విషయంలో సాయితేజ్ తప్పులేదు. అతడికి ఆలయంలో ఆచారాలు-సంప్రదాయాలు తెలియాలనే రూల్ లేదు. పక్కనే ఉన్న అధికారులు చెప్పాలి.

అయితే అక్కడ ఇలాంటివన్నీ కామన్ అంటున్నారు, ఈ వ్యవహారాల గురించి బాగా తెలిసిన జనాలు. గతంలో సింగర్ మంగ్లీ ఈ ఆలయంలో ఓ పాటను షూట్ చేసింది. ఆమెకు అధికారులు అన్ని రకాల అనుమతులిచ్చారు. ఇక గర్భాలయంలో గోడలపై ఉన్న పురాతన శాసనాలు ఓ యూట్యూబ్ ఛానెల్ లో దర్శనమిచ్చాయి.

వీటితో పోలిస్తే, సాయితేజ్ తో హారతి ఇప్పించడం పెద్ద విషయం కాదంటున్నారు కొంతమంది. ఏదేమైనా శ్రీకాళహస్తి ఆలయ ఆచార వ్యవహారాల విషయంలో ఎప్పటికప్పుడు ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయని సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.