కాపుల రిజర్వేషన్పై కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు తమ సామాజిక వర్గానికి చెందిన పవన్కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండడంతో హరిరామ జోగయ్యలో ఆశలు చిగురించాయి. ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పుడు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన పవన్కల్యాణ్పై భారీ భారాన్ని మోపుతూ లేఖ కూడా రాసారు.
ఈ లేఖలో హరిరామ జోగయ్య కీలక విషయాల్ని ప్రస్తావించారు. కాపులు ఆశిస్తున్న ఐదు శాతం రిజర్వేషన్లను మీ పాలనలో అమలు చేస్తున్నారని ఆశిస్తున్నట్టు హరిరామ జోగయ్య పేర్కొన్నారు. అలాగే కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్రంగాను పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సగం రోజులు సినిమాలకు, సగం రోజులు పరిపాలనకు కేటాయించాలని పవన్కు ఆయన విలువైన సూచనలు చేశారు.
ఇటీవల సినిమా షూటింగ్లపై పవన్కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. మూడు నెలల పాటు సినిమా షూటింగ్లకు విరామం ఇస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత నెలలో మూడు రోజులు సినిమా షూటింగ్లకు వెళ్తానని పవన్ అన్నారు. ఇక తన సామాజిక వర్గానికి రిజర్వేషన్లపై పవన్ స్పష్టత ఇవ్వాల్సి వుంది. ఎందుకంటే పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపుల రిజర్వేషన్ల సంగతేంటని జగన్ సర్కార్ను నిలదీసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆయన కీలక పదవిలో ఉన్నారు. తన సామాజిక వర్గం రిజర్వేషన్లపై ఏదో ఒకటి తేల్చి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. తాజాగా హరిరామ జోగయ్య కూడా రిజర్వేషన్ల విషయమై ప్రముఖంగా ప్రస్తావించడంతో కీలక నిర్ణయం తీసుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి వుంది.