ఈసారి నయనతార ఏం చేస్తుందో..!

దాదాపు పదేళ్ల నుంచి ఒకటే పాలసీ పెట్టుకుంది నయనతార. సినిమా మాత్రమే చేస్తుంది, ప్రచారానికి మాత్రం రాదు. అది చిరంజీవి సినిమా అయినా, రజనీకాంత్ మూవీ అయినా నయన్ దృష్టిలో ఒకటే. ఆ మేరకు…

దాదాపు పదేళ్ల నుంచి ఒకటే పాలసీ పెట్టుకుంది నయనతార. సినిమా మాత్రమే చేస్తుంది, ప్రచారానికి మాత్రం రాదు. అది చిరంజీవి సినిమా అయినా, రజనీకాంత్ మూవీ అయినా నయన్ దృష్టిలో ఒకటే. ఆ మేరకు పక్కాగా అగ్రిమెంట్ లోనే రాయించుకుంటుంది. ఇన్నాళ్లూ ఆమె అనుకున్నది అనుకున్నట్టు బాగానే నడిచింది. కానీ ఇప్పుడు అసలైన చిక్కొచ్చి పడింది.

నయనతార తాజా చిత్రం “కాథువాకుళ రెండు కాదల్”. ఇందులో ఆమె హీరోయిగా నటించింది. లెక్కప్రకారం ఈ సినిమా ప్రచారానికి కూడా ఆమె రాకూడదు. కానీ ఇక్కడ విషయం వేరే. ఈ సినిమాకు ఆమె నిర్మాత. పైగా ఈ సినిమా దర్శకుడు తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్. నిర్మాతగా అతడి పేరు కూడా ఉంది.

సో.. నయనతారకు కీలకమైన చిత్రమిది. తన బాయ్ ఫ్రెండ్ కు ఓ హిట్ ఇవ్వాలన్నా, నిర్మాతగా తను డబ్బులు సంపాదించాలన్నా ఈ సినిమా కోసం ఆమె ప్రచారం చేయక తప్పదు. మరి ఇన్నాళ్లుగా ఆమె పెట్టుకున్న నియమం సంగతేంటి? తన సినిమాకు ఒక రూల్, బయట నిర్మాతల సినిమాలకు మరో రూల్ అన్నట్టు వ్యవహరిస్తుందా?

ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. బీస్ట్ ఈరోజు రిలీజైంది కాబట్టి, రేపు లేదా ఎల్లుండి నుంచి సినిమా ప్రచారం ప్రారంభించాలనుకుంటున్నారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాకు మరింత బజ్ రావాలంటే నయన్, మీడియా ముందుకు రావాల్సిందే.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన సమంతతో కలిసి నయనతార మీడియా ముందుకొస్తుందట. ఇక్కడో ఆసక్తికర విషయాన్ని చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో ప్రభుదేవాతో బ్రేకప్ అయిన టైమ్ లో మీడియాకు దూరమైంది నయనతార. 

ఇక నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత కూడా మీడియాకు దూరమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వీళ్లిద్దరూ కలిసి ఒకేసారి మీడియా ముందుకొచ్చే అవకాశం ఉందంటున్నారు.