పబ్ లో ఉన్నది నా కూతురే కానీ.. నాగబాబు ప్రకటన

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. రాడిసన్ బ్లూ పబ్ లో గత రాత్రి పోలీసులు నిర్వహించిన దాడుల్లో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు దొరికాయి. డాన్స్ ఫ్లోర్ పై, బాత్రూమ్ లో ఎక్కడ…

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. రాడిసన్ బ్లూ పబ్ లో గత రాత్రి పోలీసులు నిర్వహించిన దాడుల్లో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు దొరికాయి. డాన్స్ ఫ్లోర్ పై, బాత్రూమ్ లో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ ప్యాకెట్లు కనిపించాయి. నిర్దేశిత టైమ్ కు మించి పబ్ ను నడిపినందుకు చర్యలు తీసుకోవడానికి వెళ్తే, ఏకంగా ఇలా రేవ్ పార్టీ బయటపడింది.

దాదాపు 120 మందితో నడిచిన ఆ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా అందులో మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఉంది. దాడుల్లో నిహారికను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ ఘటనపై నిహారిక తండ్రి నాగబాబు స్పందించారు. తన కూతురు ఆ టైమ్ లో అక్కడున్నది వాస్తవమేనని తెలిపారు.

“రాత్రి రాడిసన్ బ్లూ పబ్ లో జరిగిన ఘటనపై నేను స్పందించడానికి కారణం, నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండడమే. టైమింగ్స్ కు మించి పబ్ ను నడిపించడంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీ ఈజ్ క్లియర్. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు. సోషల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అవాంఛనీయ ఊహాగానాలకు తావు ఇవ్వకూడదని నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను.”

ఇలా తన కూతురు వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని ప్రకటించుకున్నారు నాగబాబు. మరోవైపు ఇదే పార్టీలో హీరో గల్లా అశోక్ కూడా ఉన్నాడంటూ మీడియాలో వస్తున్న వార్తల్ని, అతడి పీఆర్ టీమ్ ఖండించింది. ఈ వ్యవహారంలో అశోక్ కు ఎలాంటి సంబంధం లేదని, డ్రగ్స్ దొరికాయంటూ అతడి పేరును ముడిపెట్టి వార్తలు ప్రసారం చేయొద్దని రిక్వెస్ట్ చేసింది.