మరోసారి బాలీవుడ్ మీడియా ముందుకు చరణ్

ఆర్ఆర్ఆర్ ప్రచారం కోసం మొన్నటివరకు దేశం మొత్తం తిరిగాడు రామ్ చరణ్. ఎన్టీఆర్, రాజమౌళితో కలిసి ఆ సినిమా ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఇప్పుడు మరోసారి అలా దేశం మొత్తం తిరగడానికి ప్లాన్ చేస్తున్నాడు.…

ఆర్ఆర్ఆర్ ప్రచారం కోసం మొన్నటివరకు దేశం మొత్తం తిరిగాడు రామ్ చరణ్. ఎన్టీఆర్, రాజమౌళితో కలిసి ఆ సినిమా ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఇప్పుడు మరోసారి అలా దేశం మొత్తం తిరగడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఆర్ఆర్ఆర్ ప్రచారం కోసం కాదు, ఆచార్య సినిమా కోసం.

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఆచార్యను కూడా పూర్తి చేశాడు చరణ్. తండ్రి చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో దాదాపు అరగంట నిడివి ఉన్న ఓ కీలకమైన పాత్ర పోషించాడు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యేంతవరకు ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాకూడదనేది కండిషన్.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిపోవడంతో, ఆచార్య ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. సరిగ్గా నెల రోజుల్లో (ఏప్రిల్ 29) థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు పాన్-ఇండియా అప్పీల్ తీసుకొచ్చే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు చరణ్. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన క్రేజ్ ను ఆచార్య కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు.

ఆర్ఆర్ఆర్ తరహాలోనే ఆచార్య కోసం కూడా దాదాపు 10 రోజుల ముందే పక్కా ప్రణాళికతో ప్రచారం చేయాలనుకుంటోంది యూనిట్. ఇందులో భాగంగా నార్త్ లో చిరంజీవి కంటే చరణ్ నే ఎక్కువగా ప్రొజెక్ట్ చేయాలని భావిస్తున్నారు. సో.. ఈసారి తన తండ్రి కోసం, ఆచార్య సినిమా కోసం చరణ్ ప్రచార బాధ్యతను మోయబోతున్నాడు. ఇంకో 2 వారాల్లో మరోసారి బాలీవుడ్ మీడియా ముందుకు రాబోతున్నాడు.

కొరటాల శివ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్, చరణ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు. ఆర్ఆర్ఆర్ కోసం ఆపేసిన ఆచార్య ప్రచారాన్ని వచ్చే వారం నుంచి మరోసారి ప్రారంభించబోతున్నారు.