విశాఖకు టీడీపీయే అండ..అంతే !

విశాఖకు ఎవరు కాపాడుతారు, ఎవరు కాపాడగలరు అంటే టీడీపీ అని జవాబు రావాలి. టీడీపీ అధికారంలో ఉంటే విశాఖ స్వర్గం. ఇదే భావన జనంలోకి రావాలి. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంటే విశాఖకు నరకమే.…

విశాఖకు ఎవరు కాపాడుతారు, ఎవరు కాపాడగలరు అంటే టీడీపీ అని జవాబు రావాలి. టీడీపీ అధికారంలో ఉంటే విశాఖ స్వర్గం. ఇదే భావన జనంలోకి రావాలి. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంటే విశాఖకు నరకమే. ఈ మాట అనేకసార్లు టీడీపీ నేతలు చెబుతూ వచ్చారు. విశాఖ ఎంపీ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాపు వ్యవహారం ఇపుడు కలసి వచ్చింది. దాంతో విశాఖను కాపాడుకుందామని టీడీపీ ప్రతిజ్ఞ చేస్తోంది.

విశాఖ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి మరీ విశాఖను కాపాడుకుంటాం, ఆ నీలి సంద్రం మీద ఆన, ఆ పచ్చని కొండలి మీద అంటూ టీడీపీ నేతలు నడి వీధుల్లో పసుపు పరిమళాలు వెదజల్లుతూ కలియతిరిగారు. 

విశాఖలో గంజాయి మాఫియా నుంచి ల్యాండ్ మాఫియా నుంచి కాపాడుకుందాం, కిడ్నాపర్ల నుంచి విశాఖను రక్షించుకుందామనుకుంటూ టీడీపీ నేతలు వీధుల్లోకి వచ్చారు. వైసీపీ హయాంలో విశాఖలో అరాచకాలు పెచ్చరిల్లాయని తమ్ముళ్ళు అంటున్నారు.

ఏపీలో వైసీపీ పాలన అంతమైతేనే విశాఖలో శాంతి అంటున్నారు. ఎమ్మెల్యే గణబాబు ఎమ్మెల్సీ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్యేలు పలువురు ఇందులో పాల్గొని నినాదాలు చేశారు. ఏతా వాతా టీడీపీ ర్యాలీ తేల్చింది ఏంటి అంటే టీడీపీతోనే విశాఖకు అండ. ఆ పార్టీతోనే విశాఖ వికసిస్తుంది అని. జనాలు దీని మీద ఏమంటారో.