వారాహి యాత్ర‌పై బొత్స సెటైర్లు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌కల్యాణ్ చేప‌ట్టిన వారాహి యాత్ర‌పై సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సెటైర్లు విసిరారు. చంద్ర‌బాబు రాజ‌కీయ ప‌ల్ల‌కీ మోయ‌డానికే ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని పెట్టార‌నేది వైసీపీ ఆరోప‌ణ‌. ఇప్పుడు వారాహి యాత్ర‌ను కూడా…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌కల్యాణ్ చేప‌ట్టిన వారాహి యాత్ర‌పై సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సెటైర్లు విసిరారు. చంద్ర‌బాబు రాజ‌కీయ ప‌ల్ల‌కీ మోయ‌డానికే ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని పెట్టార‌నేది వైసీపీ ఆరోప‌ణ‌. ఇప్పుడు వారాహి యాత్ర‌ను కూడా చంద్ర‌బాబును సీఎం చేయ‌డానికే త‌ప్ప‌, తాను అధికారంలోకి రావాల‌నే ఆకాంక్ష ప‌వ‌న్‌లో లేద‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెట్టారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న‌దైన స్టైల్‌లో వ్యంగ్య కామెంట్స్ చేశారు. విశాఖ‌లో బొత్స మీడియాతో మాట్లాడుతూ వారాహి యాత్ర అంటే ఏంట‌ని ప్ర‌శ్నించారు. అదేందో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. కాశీయాత్ర లాగా వారాహి యాత్ర అంటే ఏమ‌ర్థ‌మ‌వుతుంద‌ని ఆయ‌న దెప్పి పొడిచారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌స్సుయాత్ర అంటే జ‌నానికి అర్థం అవుతుంద‌ని అన్నారు.

పవన్ ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని ప‌వ‌న్ అన‌డాన్ని బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌స్తావించారు. త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆపేస్తామ‌ని చెప్పాల‌ని ప‌వ‌న్‌ను  బొత్స స‌త్య‌నారాయ‌ణ డిమాండ్ చేయ‌డం విశేషం . ఈ మ‌ధ్యే ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్ట‌న‌ర్ తాము అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను పెంచి ఇస్తాన‌ని చెప్పాడ‌ని చంద్ర‌బాబుకు చుర‌క‌లు అంటించారు. చంద్ర‌బాబు తాను తీసుకొచ్చిన ఒక్క ప‌థ‌కం గురించి అయినా చెప్ప‌గ‌ల‌డా? అని నిల‌దీశారు.

వారాహి యాత్ర‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎటూ వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేయ‌డం ఖాయం. వారాహి యాత్ర సాగిన‌న్ని రోజులూ ప‌వ‌న్‌, వైసీపీ మ‌ధ్య డైలాగ్ వార్ త‌ప్ప‌క జ‌రుగుతుంది. బొత్స సెటైర్స్ మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మే. వైసీపీ నేత‌లు ప‌వ‌న్ విమ‌ర్శించ డానికి క్రియేటివిటీకి ప‌దును పెట్ట‌డానికి సిద్ధంగా ఉన్నారు.