తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు అనే వార్తల నేపథ్యంలో..నిజంగా చంద్రబాబుకు నంద్యాల అంత అనుకూలమైన నియోజకవర్గమా అనే చర్చకు కూడా ఆస్కారం ఏర్పడుతూ ఉంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేయరు.. అక్కడ ఆయనకు అనుకూలత లేదు అనే ప్రచారం మొదటి నుంచి జరుగుతూ ఉంది. గత ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడుకు అక్కడ మెజారిటీ చాలా వరకూ తగ్గిపోయింది. అందునా కుప్పంలో దొంగ ఓట్ల దందా అనేది పదేళ్ల నుంచి చర్చలో ఉన్న అంశమే!
చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో దొంగ ఓట్లు రికార్డు స్థాయిలో ఉన్నాయని.. పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తెచ్చి ఇక్కడ ఓట్లు వేయించుకుంటారనే టాక్ ఉంది. ఏకంగా వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఇక్కడ ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటికి చెక్ పడే పరిస్థితి వచ్చింది. కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ చిత్తయ్యింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించినట్టుగా అప్పట్లో టీడీపీ ప్రకటించినా.. అప్పుడు టీడీపీ అభ్యర్థులు అయితే బరిలో నిలిచారు. నామినేషన్లు అయ్యాకా బహిష్కరణ అంటూ పిలుపునిచ్చారు. అయితే టీడీపీ అభ్యర్థులు ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే ఎక్కడా టీడీపీ పరువు దక్కలేదు.
అలా స్థానిక ఎన్నికల్లో చిత్తవ్వడంతో కుప్పంలో చంద్రబాబు కథ కంచికి చేరినట్టే అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఇక్కడ విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి కూర్చుంది. చంద్రబాబుకు బహుశా ఆఖరి ఎన్నికల్లో ఆయనను ఎమ్మెల్యేగా కూడా ఓడించాలని ఆ పార్టీ గట్టి ప్రయత్నిస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేసే ధైర్యం చేయరనే టాక్ కూడా నడుస్తోంది.
అయితే ఈ మధ్యనే కుప్పంలో సొంతిల్లు అంటూ హడావుడి మొదలుపెట్టారు. అయితే అదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని కుప్పం నుంచి కాకుండా ఆయన నంద్యాల నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట!
మరి నంద్యాల నుంచి బరిలోకి దిగితే మాత్రం చంద్రబాబుకు అక్కడ అంత సానుకూలత ఉందా అనేది కూడా ప్రశ్నార్థకమే! ఎంతకాదన్నా.. నంద్యాల చంద్రబాబు సొంత కులం ప్రాబల్యం ఉన్న ప్రాంతం కాదు. కుప్పానికి ప్రత్యామ్నాయంగా ఆయన ఏ కృష్ణా జిల్లాలోనో చూసుకోవాల్సింది కానీ, కర్నూలుకు రావడం అంటే కోరి ప్రమాదాన్ని ఎదుర్కొనడమే అవుతుంది.
నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మం గెలిచిన నాటి పరిస్థితులను ఊహించుకుని చంద్రబాబు నాయుడు నంద్యాలకు వస్తే.. అది సాహసమే అవుతుంది. రోడ్లన్నింటినీ తవ్వేసి, మమ్మల్ని గెలిపిస్తేనే ఇవన్నీ పూర్తవుతాయి లేకపోతే అంతే సంగతులు అని ప్రజలను బెదిరించారు. ఆ పై ఆ సానుభూతి ఆ కథ వేరే! అధికారం చేతిలో పెట్టుకుని.. అరడజను మంది మంత్రులు, డజను మంది ఎమ్మెల్యేలు, పంచాయతీకో ఇన్ చార్జి.. ఇంతమంది అక్కడే కూర్చుని పని చేస్తే టీడీపీకి వచ్చిన మెజారిటీ అంతంత మాత్రం! ఆ తర్వాతి ఎన్నికల్లో నంద్యాల్లో టీడీపీ అసలు స్టామినా ఏమిటో రుజువయ్యింది కదా!
ఇన్నేళ్లు కుప్పం నుంచి గెలిచి.. అక్కడ ఉద్దరించింది చాలని ఇప్పుడు నంద్యాలకు వస్తే చంద్రబాబును నమ్మేంత అమాయకులు ఎవ్వరూ ఉండకపోవచ్చు! అందులోనూ కుప్పం నుంచి కాకుండా చంద్రబాబు నాయుడు వేరే ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయన భయపడుతున్నాడని, కనీసం ఎమ్మెల్యేగా నెగ్గడానికి ఇన్నేళ్లకు కుప్పాన్ని వీడి పక్కకు వెళ్లారనే అభిప్రాయాలూ ప్రజల్లో బలపడతాయి! అధినేతకే అంత భయం అయితే.. ఇక పార్టీ పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు!