విలక్షణ నటుడు, దేశం గర్వించదగ్గ హీరో కమల్హాసన్ ముద్దుల తనయ శృతిహాసన్. తండ్రి వారసత్వంతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినప్పటికీ, ఆ తర్వాత నటనా ప్రతిభతతో తనను నిరూపించుకున్నారు.
తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడంలో శృతి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. వివిధ కారణాలతో మూడేళ్లుగా చిత్రపరిశ్రమకు దూరంగా ఉన్న శృతి … తాజాగా క్రాక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో పలు అంశాలపై ముచ్చటించారు.
క్రాక్ సినిమాలో తాను పోషించిన కల్యాణి పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతోందన్నారు. ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. సినిమాపై అన్ని మీడియా వేదికల్లోనూ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందన్నారు.
మూడేళ్ల తర్వాత తాను నటించిన సినిమా విజయంతో శుభారంభాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. లెక్కలేసుకుని సినిమాలు చేయడం పాతకాలపు సిద్ధాంతంగా ఆమె అభిప్రాయపడ్డారు.
కెరీర్ పరంగా మొదటి నుంచి కూడా తాను అనేక సవాళ్లు, ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తాజా సినిమాలో తల్లి పాత్ర చేయాలా? వద్దా? అనే సంశయం ఎప్పుడూ తనకు రాలేదన్నారు.
అగ్ర హీరోయిన్లు తల్లి, భార్య పాత్రలు చేయకూడదనే ఆలోచనకు ఏనాడో కాలం చెల్లిందన్నారు. మూడేళ్ల పాటు సినిమాలకు దూరం కావడంపై తరచూ తనకు ప్రశ్నలు ఎదరవుతున్నాయన్నారు. అయితే ఈ విరామం స్వచ్ఛందంగా కోరుకున్నదే తప్ప, అవకాశాలు లేక మాత్రం కాదన్నారు.
తనను తాను సరికొత్తగా, సృజనాత్మకంగా ఆవిష్కరించుకోడానికి మూడేళ్ల విరామం పనికొచ్చిందన్నారు. ఏ రంగంలో అయినా ప్రతి ఒక్కరికీ ఇలాంటి విరామం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
సంగీతంలో కూడా తనకు ప్రవేశం ఉండడంతో అటువైపు దృష్టి పెట్టాలనే తలంపుతోనే సినిమాలకు విరామం తీసుకున్నట్టు శృతి చెప్పుకొచ్చారు. అంతేకాదు, తన వద్దకు వచ్చిన సినిమా కథలు, పాత్రలు నచ్చకపోవడం వల్ల కూడా బ్రేక్ తీసుకోడానికి కారణంగా ఆమె తెలిపారు.
మరీ ముఖ్యంగా సినిమాలకు విరామం తీసుకోవడం తన జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఒకటిగా ఆమె అభివర్ణించారు. ఏదైనా నచ్చకుంటే తిరస్కరించే గుణాన్ని ఈ విరామంలో అలవర్చుకున్నట్టు శృతి తెలిపారు.