చేతిలో సొంత రాజకీయ పార్టీ పెట్టుకుని, ఇతర పార్టీలను దేబరించాల్సిన కర్మ కమ్మోళ్లకు ఎందుకు?..అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇదే ప్రశ్న కమ్మ సామాజిక వర్గీయుల్ని ఆలోచింపజేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎవరిదంటే.. కమ్మోళ్లదని ఎవరైనా చెప్పే సమాధానం. అలాగే కాంగ్రెస్ పార్టీని రెడ్ల పార్టీగా నిన్నమొన్నటి వరకూ పిలిచేవారు.
ఇప్పుడు బీఆర్ఎస్లో రెడ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. తెలంగాణలో రెడ్ల సామాజిక వర్గం రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తోంది. దీంతో బీఆర్ఎస్కు వెలమ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం వహిస్తున్నప్పటికీ, తమ పార్టీగా రెడ్లు ఓన్ చేసుకుంటున్నారు.
2018లో 35 సీట్లు, 2023కు వచ్చే సరికి ఐదు సీట్లు పెంచి మొత్తం 40 సీట్లను రెడ్లకు కేసీఆర్ కేటాయించారు. ఇదే కాంగ్రెస్ విషయానికి వస్తే తాజాగా వెల్లడైన మొదటి జాబితాలో 55 స్థానాలకు గాను 17 చోట్ల రెడ్లకు, ఏడు సీట్లు వెలమ, బీసీలకు 12 సీట్లు కేటాయించారు. కమ్మ సామాజిక వర్గానికి మొదటి జాబితాలో చోటు దక్కలేదు. బీఆర్ఎస్ మాత్రం ఐదు సీట్లతో సరిపెట్టింది.
కనీసం కాంగ్రెస్లో అయినా తమకు న్యాయం దక్కుతుందని కమ్మ సామాజిక వర్గం ఆశలు పెట్టుకుంది. కనీసం 10 లేదా 12 సీట్లైనా తమకు ఇవ్వాలని ఇటీవల కమ్మ సంఘం నేతలు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్కు మొరపెట్టుకున్నారు. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ చూస్తే, కమ్మ సామాజిక వర్గం విన్నపాలు పని చేయనట్టే కనిపిస్తోంది. అసలు తమ సామాజిక వర్గానికి టీడీపీ అనే పార్టీ ఉందని, దాన్ని తమ కుల దైవం దివంగత ఎన్టీఆర్ స్థాపించారని, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు ఉన్నారనే విషయాన్ని కమ్మలు మరిచినట్టున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్తితుల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టి చేస్తామని తేల్చి చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ తర్వాత తానీ ప్రకటన చేస్తున్నట్టు కాసాని తెలిపారు. మాతృపార్టీ టీడీపీ పెట్టుకుని, కాంగ్రెస్, బీఆర్ఎస్ను టికెట్ల కోసం దేబరించాల్సిన కర్మ కమ్మ సామాజిక వర్గానికి ఏం పట్టిందనే చర్చకు తెరలేచింది.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అంత నమ్మకం ఉన్నప్పుడు రిజర్వ్డ్ స్థానాలు మినహాయించి, మిగిలిన సీట్లలో కమ్మ సామాజిక నాయకులు పోటీ చేస్తామంటే వద్దనే వాళ్లెవరు? ఈ కోణంలో వారు ఆలోచిస్తే ఆత్మగౌరవం దక్కుతుంది.