ఓటీటీలోకి మరో అక్కినేని నటవారసుడు

హీరో నాగచైతన్య ఇప్పటికే ఓటీటీలోకి ఎంటరయ్యాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇక నాగార్జున కూడా ఓటీటీ డెబ్యూ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు. మంచి కథ కోసం వెయిటింగ్.…

హీరో నాగచైతన్య ఇప్పటికే ఓటీటీలోకి ఎంటరయ్యాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇక నాగార్జున కూడా ఓటీటీ డెబ్యూ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు. మంచి కథ కోసం వెయిటింగ్. ఇప్పుడు అక్కినేని కాంపౌండ్ నుంచి మరో హీరో కూడా ఓటీటీ లోకొస్తున్నాడు. అతడే సుశాంత్.

చాన్నాళ్లుగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు సుశాంత్. అతడు నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ బరిలో నిలబడడం లేదు. చివరికి అల వైకుంఠపురములో సినిమాతో వచ్చిన క్రేజ్ కూడా అతడి మార్కెట్ ను పెంచలేకపోయింది. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్.

వరుడు కావలెను సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన లక్ష్మీసౌజన్య… తన రెండో ప్రయత్నంగా ఈ వెబ్ డ్రామాను సెలక్ట్ చేసుకుంది. ఇందులో ఓ కీలక పాత్రకు సుశాంత్ ను ఎంపిక చేశారు. ఇందులో సుశాంత్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. పోలీస్ జీప్ ముందు మఫ్టీలో నిల్చున్న సుశాంత్ లుక్ ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ క్యారెక్టర్ కోసం కాస్త మీసం, గడ్డం, జుట్టు పెంచి మేకోవర్ అయ్యాడు సుశాంత్.

రీసెంట్ గా ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమా చేశాడు సుశాంత్. ఆ సినిమా ఫెయిల్ అయింది. అప్పట్నుంచి మరో సినిమాను ప్రకటించలేదు ఈ హీరో. ఈ గ్యాప్ లో రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషించడానికి అంగీకరించాడు. 

ఇప్పుడు ఏకంగా ఇలా వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టాడు. త్వరలోనే జీ5లో స్ట్రీమింగ్ కు రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.