మాజీ మంత్రులు జోరు పెంచేశారు

విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రులు ఇద్దరూ ఒక్కసారిగా జోరు పెంచేశారు. వారే గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు. అయ్యన్న పార్టీ ఓడిన దగ్గర నుంచి మీడియా ముందుకు వస్తున్నారు. గంటా మాత్రం…

విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రులు ఇద్దరూ ఒక్కసారిగా జోరు పెంచేశారు. వారే గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు. అయ్యన్న పార్టీ ఓడిన దగ్గర నుంచి మీడియా ముందుకు వస్తున్నారు. గంటా మాత్రం కొన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉండి ఇపుడే హైలెట్ కావాలని చూస్తున్నారు.

ఈ ఇద్దరికీ వైసీపీ ప్రభుత్వం తప్పిదాలు వెతుక్కోవడం విమర్శలు చేయడం టార్గెట్ గా మారింది. ప్రకాశం జిల్లా కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని ని అక్రమంగా అరెస్ట్ చేస్తారా అంటూ గంటా వైసీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. వైసీపీని దళిత వ్యతిరేక సర్కార్ అంటూ నిందించారు. వీరాంజనేయస్వామిని దళిత మేధావిగా అభివర్ణించారు.

గంటా వైసీపీని టార్గెట్ చేస్తున్న సమయంలోనే అయ్యన్న కూడా రెడీ అన్నారు. అమిత్ షాతో చంద్రబాబు కలిసింది వైసీపీని గద్దె దించడానికే అంటూ ఆయన అసలు గుట్టు బయటపెట్టారు. ఏపీలో సాగుతున్న దుర్మార్గమైన పాలనను అంతమొందించేందుకు టీడీపీ అందరినీ కలుపుకుంటుంది. అమిత్ షా తో భేటీలో ఏమి మాట్లాడారు అని ప్రత్యేకంగా అడగడమేంటి అని అయ్యన్న ఫైర్ అవుతున్నారు.

టీడీపీలో అంతా కలసి పనిచేయాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీతో సమరమే అంటున్నారు. ఎక్కడా తగ్గేదే లే అంటున్నారు. వైసీపీ మీద విమర్శలు చేయడంతో పోటీ పడుతున్నారు. వీటిని చూసిన వారు మాత్రం పార్టీ కోసమా లేక ఆధిపత్యం కోసమా అన్నదే ఆలోచిస్తున్నారుట.