తిరుపతిలో ఎక్కడ చూసినా ప్రభాస్ అభిమానులే. దారులన్నీ తారకరామా స్టేడియం వైపే. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యేందుకు ఎక్కడెక్కడి నుంచో అభిమానులు తిరుపతికి తరలి వెళ్లారు. తీరా వేడుక ప్రారంభ సమయానికి తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ ఏరియాలో ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలైంది.
పెద్ద ఎత్తున గాలి వీచడంతో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకకు చేసిన ఏర్పాట్లపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో చిత్ర యూనిట్ ఆందోళనకు గురైంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే… భారీ వర్షం తిరుపతి నగరమంతా పడలేదు. కేవలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగే యూనివర్సిటీ నుంచి, అటు వైపు చంద్రగిరి వైపు మాత్రమే భారీ వర్షం పడడం విశేషం.
నగరంలోని తిరుచానూరు మార్గం, పద్మావతిపురం, శ్రీనివాసపురం, రేణిగుంట తదితర మార్గాల్లో ఎలాంటి వర్షం లేదు. కేవలం ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఆదిపురుష్ వేడుకకు సంబంధించి అభిమానుల్లో ఆందోళన నెలకుంది.
అయితే ఎక్కువ సేపు వర్షం పడే అవకాశాలు కనిపించలేదు. మరోవైపు వర్షం తగ్గుదల కనిపించడంతో సంబరం మొదలైనట్టు సమాచారం. ఇదిలా ఉండగా తారకరామా స్టేడియంలో జై శ్రీరాం.. జైజైశ్రీరాం అంటూ అభిమానులు నినాదించడం విశేషం.