తెలంగాణలో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు వుంటుందనే ప్రచారం ఊపందుకుంది. అయితే పొత్తు వార్తలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొట్టి పారేశారు. ఇవన్నీ ఊహాజనితమన్నారు. అమిత్షా, జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ అయితే తప్పేంటని బండి సంజయ్ ప్రశ్నించడం విశేషం. బండి సంజయ్ స్పందనపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు భేటీ కావడం తప్పేమీ కాదు, మరి తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధపడతారా? అనే ప్రశ్నను సంధిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ను నిండా ముంచిన చంద్రబాబుతో అంటకాగలిగే ధైర్యం, సాహసం బీజేపీ చేస్తుందా సంజయ్ అని మరికొందరు నిలదీస్తున్నారు. తెలిసి తెలిసి చంద్రబాబుతో కలవడం అంటే బీజేపీ అజ్ఞానం ఏ రేంజ్లో వుందో అర్థమవుతోందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
అప్పుడు కాంగ్రెస్ను, ఇప్పుడు బీజేపీని ముంచడానికి చంద్రబాబు రెడీ అయ్యారు… తప్పేమీ లేదని బండి సంజయ్ అంటున్నాడు, ఇక జాతీయ పార్టీలను కాపాడే దిక్కే లేదా? అని నెటిజన్లు వెటకరిస్తున్నారు.
తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబుతో బీజేపీ నేతలు భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే చంద్రబాబు వ్యతిరేకులంతా, అటు వైపు పార్టీలకు మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. బాబుతో లాభం కంటే, నష్టమే ఎక్కువని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.