ఇటీవల కాలంలో టీడీపీ గ్రాఫ్ బాగా పడిపోతోందన్న అభిప్రాయం వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే పార్టీలో అసమ్మతి గళాలు పెరిగిపోవడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు పలు సంస్థల ద్వారా చేయిస్తున్న సర్వేలు… రానున్న రోజుల్లో టీడీపీదే అధికారం అనే భరోసా ఇవ్వలేకపోతున్నాయి. దీంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. ఈ దఫా అధికారంలోకి రాకపోతే, టీడీపీ భవిష్యత్ గాలిలో దీపం అవుతుందనే ఆందోళన ఆయనలో రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని ఆయన పట్టుదలతో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సీఎం వైఎస్ జగన్ విషయానికి వస్తే ఆయన మాటల్లో, చేతల్లో అధికారం తనదే అనే ధీమా, ధైర్యం కనిపిస్తున్నాయి. 175 స్థానాల్లోనూ గెలుస్తామని ఆయన బల్లగుద్ది మరీ చెబుతుండడాన్ని గమనించొచ్చు. చంద్రబాబు మాత్రం ఒంటరిగా ఎన్నికలకు వెళితే జగన్ను ఓడించలేమనే నిర్ణయానికి వచ్చారు.
దీంతో మొదట జనసేనాని పవన్కల్యాణ్ను కన్ను గీటారు. తాజాగా బీజేపీని దువ్వుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ తనకు అధికారంపై నమ్మకం లేకనే అనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో బీజేపీకి కనీసం ఒక్క శాతం కూడా ఓట్లు లేవు. కానీ కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇతరేతర ప్రయోజనాలు వుంటాయనే ఉద్దేశంతో బాబు నానా తిప్పలు పడుతున్నారు. తనకు తానుగా చంద్రబాబు తాపత్రయ పడుతున్నప్పుడు వద్దని ఎందుకనాలనే ఉద్దేశంతో బీజేపీ కూడా గేమ్ స్టార్ట్ చేసింది.
ఒంటరిగా పోటీ చేసినా అధికారం వస్తుందనే నమ్మకమే వుంటే, జనసేన, బీజేపీ వైపు చంద్రబాబ అసలు చూసేవారు కాదనేది బహిరంగ రహస్యమే. పైగా 2014 సెంటిమెంట్ పని చేస్తుందనే ఆశ. కూటి కోసం కోటి విద్యలనే చందంగా, అధికారం కోసం చంద్రబాబు పొత్తు ఫీట్లు చంద్రబాబు వేస్తున్నారు. బాబు భయాన్ని సాకుగా తీసుకుని బీజేపీ రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాన్ని ఎలా మలుపు తిప్పనుందో చూడాలి.