రాయలసీమ కష్టనష్టాలకు కారణమైన పార్టీనే, ఇవాళ మళ్లీ అద్భుతాలు సృష్టిస్తామని వాగ్దానాలు చేయడం విచిత్రంగా వుంది. అధికారంలో ఉన్నంత కాలం సీమను మరింతగా ఎండబెట్టి, తమను ఆదరిస్తే… సస్యశ్యామలం చేస్తాం, పారిశ్రామీకరిస్తామని హామీలు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాలుగేళ్ల క్రితం తామే అధికారంలో ఉన్నామన్న స్పృహ లోకేశ్లో కొరవడినట్టుంది. ఈ నెల 7న కడపలో రాయలసీమ అభివృద్ధి ప్రణాళికలను విడుదల చేయనున్న నేపథ్యంలో ….సీమకు చంద్రబాబు చేసిన, చేస్తున్న ద్రోహం తెరపైకి వచ్చింది.
కుప్పంలో మొదలు పెట్టిన యువగళం పాదయాత్ర త్వరలో కడపలో పూర్తి చేసుకోవడం ద్వారా …సీమంతా నడిచినట్టు అవుతుంది. తన పాదయాత్ర రాయలసీమలో పూర్తయ్యేలోపు ఆ ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను ప్రకటిస్తానని లోకేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయం రానే వచ్చింది. రాయలసీలో ఉపాధి లేక వలసలు పోతున్నారని, బాగా చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళుతున్న విషయాలన్ని తెలుసుకున్నానని లోకేశ్ చెబుతున్నారు. సీమలో సాగు, తాగునీరు లేక ప్రజానీకం అల్లాడుతున్న వైనాన్ని గుర్తించానని లోకేశ్ తెలిపారు. సీమ కన్నీళ్లు తుడవడానికి రాయలసీమ అభివృద్ధి ప్రణాళిక విడుదల చేస్తానని, నమ్మి ఆదరించాలని ఆయన వేడుకోవడం విశేషం.
అసలు రాయలసీమ కన్నీళ్లకు కారకులైన పాలకుడే చంద్రబాబు అని ఆ సమాజం గుర్తించడం వల్లే ఎన్నికల్లో గుణపాఠం చెప్పింది. దివంగత వైఎస్సార్ చొరవ చూపకపోతే పోతిరెడ్డిపాడు కాలువ వెడల్పునకు నోచుకునేదా? అనేది ప్రశ్న. సీమకు తాగు, సాగునీళ్లు ఇవ్వొద్దంటూ టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకాశం బ్యారేజీ మీద ఆందోళనకు దిగితే, ఇదే చంద్రబాబునాయుడు మద్దతు ఇవ్వడం వాస్తవం కాదా?
సిద్దేశ్వరం అలుగు నిర్మిస్తే సీమ సస్యశ్యామలం అవుతుందని ఉద్యమాలు చేస్తే, అణచివేత చర్యలకు పాల్పడింది చంద్రబాబు కాదా? సీమకు కనీసం హైకోర్టు అయినా ఇవ్వాలని వేడుకుంటే, కాదు, కూడదని ఆ ప్రాంత ఆకాంక్షను పరిగణలోకి తీసుకోకుండా, అమరావతికి తీసుకెళ్లింది ఈ బాబు కాదా? అనే ప్రశ్నల్ని సీమ సమాజాం సంధిస్తోంది. రాయలసీమకు హైకోర్టు ఇస్తామని జగన్ ప్రభుత్వం అంటుంటే, బెంచ్ మాత్రమే ఇస్తామని చెబుతున్న టీడీపీని ఆదరించాలా?
టీడీపీకి అధికారం ఇస్తే ఏ ప్రాంతం, ఏ సామాజిక వర్గం ప్రయోజనాల కోసం పని చేస్తుందో రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెలుసు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన తన తండ్రి చంద్రబాబు సీమకు ఏదైనా చేసి వుంటే, ఇవాళ ఉపాధి కోసం వలసలు, అలాగే కరువులు, తాగు,సాగునీటి కష్టాలు ఉండేవా? అనే విషయమై లోకేశ్ ఒక్కసారి ఆలోచించాలి. సీమ అభివృద్ధి ప్రణాళిక పేరుతో జనాన్ని మోసగించే ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.