అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసలు అందుకుంటోంది. ఇదే సందర్భంలో మరో అంశం టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని ఆందోళనకు గురి చేస్తోంది.
చంద్రబాబు నాన్చివేత ధోరణి పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందనే భయం టీడీపీ నాయకుల్ని వెంటాడుతోంది. చంద్రబాబుది మొదటి నుంచి నాన్చివేత ధోరణి. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు విసిగిపోయే పరిస్థితి.
ఈ నేపథ్యంలో మొహమాటానికి వెళ్లకుండా అభ్యర్థుల ఎంపిక చేయాలనే నిర్ణయానికి రావడాన్ని చంద్రబాబులో చోటు చేసుకున్న మార్పుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే చివరి వరకూ ఎటూ తేల్చకుండా కాలయాపన చేయడం వల్ల ఆ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని టీడీపీ నేతల అభిప్రాయం. దీని వల్ల నిర్మొహమాటం లేకుండా నిర్ణయాలు తీసుకున్నా ప్రయోజనం లేదని చెబుతున్నారు.
ఉదాహరణకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జ్గా కన్నా లక్ష్మీనారాయణను ఎంపిక చేయడంపై ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సత్తెనపల్లిలో ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు.
కన్నా ఎంపికతో కోడెల శివరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే ఎన్నికల నాటికి పార్టీలో అసంతృప్తులు, ఆగ్రహావేశాలు చల్లారి… నష్టం లేకుండా పోతుందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే రీతిలో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల ఎంపిక ప్రకటనలు రావాల్సిన అవసరం వుందని చెబుతున్నారు.
ఎన్నికల వరకూ ఎటూ తేల్చకుండా కాలయాపన చేస్తూ వెళితే, ఫైనల్గా పార్టీకే ఎన్నికల్లో నష్టం వస్తుందనే టీడీపీ నాయకులు చెబుతున్నారు. సత్తెనపల్లి మోడల్ను తీసుకుంటే, అంతిమ నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలనే రీతిలో, పార్టీ శ్రేణులు ఒక నాయకుడి వైపే నిలుస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అలా కాకుండా నామినేషన్ సమయం వరకూ ఎటూ తేల్చకపోతే సొంత పార్టీ నేతలే ఎన్నికల్లో తీవ్ర నష్టం చేస్తారని, వారే ఓడించేందుకు ప్రత్యర్థులతో చేతులు కలుపుతారని అంటున్నారు. మరి చంద్రబాబు కాలయాపనపై మారాల్సిన అవసరం వుంది.